Breaking News

మిస్ యూనివర్స్ 2021‌గా భారతీయ యువతి సంధూ.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం


కీరిటాన్ని భారతీయ యువతి గెలుపొందారు. దీంతో 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం గెలుపొందిన భారతీయురాలిగా సంధూ రికార్డు నెలకొల్పింది. చివరిసారిగా లారా దత్తా 2000లో మిస్ యూనివర్స్‌ టైటిల్‌ను గెలుపొందింది. ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరం జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో పరాగ్వే, దక్షిణాఫ్రికా సుందరీమణుల నుంచి హర్నాజ్ తీవ్ర పోటీ ఎదుర్కొని.. చివరకు అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. విజేతగా నిలిచిన హర్నాజ్ సంధూకు గతేడాది మిస్ యూనివర్స్ మెక్సికో భామా అండ్రాయి మెజా కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీల్లో పర్వాగే సుందరి ఫస్ట్ రన్నరప్‌గానూ, దక్షిణాఫ్రికా యువతి రెండో రన్నరప్‌గానూ నిలిచారు. టాప్-3 రౌండ్‌లో ‘నేడు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్న యువతులకు ఎలా ఎదుర్కోవాలో మీరు ఏ సలహా ఇస్తారు’ అనే ప్రశ్నకు సంధూ ఇచ్చిన సమాధానం న్యాయనిర్ణేతలను మెప్పించింది. ‘నేటి యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద ఒత్తిడి.. తమను తాము నమ్ముకోవడం. మీరు ప్రత్యేకమైనవారని తెలుసుకోవడం మిమ్మల్ని అందంగా చేస్తుంది. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండి.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరిన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుదాం.. బయటకు రండి.. మీ కోసం మాట్లాడండి.. ఎందుకంటే మీరు మీ జీవితానికి నాయకుడు.. మీరు మీ స్వంత గొంతుక.. నేను నన్ను నమ్ముకున్నాను.. అందుకే నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు. ఇక టాప్-5 పోటీల్లో ‘చాలా మంది ప్రజలు వాతావరణ మార్పు ఒక బూటకమని అనుకుంటారు.. వారిని ఒప్పించడానికి మీరు ఏమి చేస్తారు’ అన్న ప్రశ్నకు సంధూ సంతృప్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘ప్రకృతి ఎదుర్కొంటున్న చాలా సమస్యలు చూసి నా గుండె పగిలిపోతుంది.. మన బాధ్యతారహిత ప్రవర్తన వల్లే ఇదంతా జరిగింది.. తక్కువ మాట్లాడి చర్య తీసుకోవడానికి ఇది సరైన సమయం అని నేను పూర్తిగా భావిస్తున్నాను.. ఎందుకంటే మన ప్రతి చర్య ప్రకృతిని రక్షించగలదు లేదా చంపేయగలదు.. పశ్చాత్తాపం, మరమ్మత్తు కంటే నిరోధించడం, రక్షించడం ఉత్తమం.. ఈ రోజు నేను మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను’ అని సమయస్ఫూర్తితో సమాధానం ఇచ్చి ఆకట్టుకున్నారు. 1994లో తొలిసారి సుస్మితా సేన్ మిస్ యూనివర్స్‌గా భారత్ నుంచి ఎంపికయ్యారు. ఆ తర్వాత 2000లో లారా దత్తాలు కిరీటాన్ని సొంతం చేసుకోగా.. తాజాగా ఈ కిరీటం సంధూ దక్కించుకున్నారు. ప్రస్తుతం మిస్ యూనివర్స్ పోటీలల్లో బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతాలా జ్యూరీ సభ్యురాలిగా ఉన్నారు. దాదాపు 80 దేశాలకు చెందిన అమ్మాయిలు పోటీపడగా.. చివరకు భారతీయ యువతి విజేతగా నిలవడం విశేషం. 21 ఏళ్ల హర్నాజ్‌ కౌర్‌ సంధు చంఢీగఢ్‌లో2000 సంవత్సరంలో జన్మించారు. శివాలిక్‌ పబ్లిక్‌ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసి.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నారు. హర్నాజ్‌ చిన్నప్పటి నుంచి యోగా ఔత్సాహికురాలే కాదు.. ఫిట్‌నెస్‌‌పై శ్రద్ధ ఎక్కువ . గుర్రపు స్వారీ, స్మిమ్మింగ్, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్‌‌లను అమితంగా ఇష్టపడతారు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరికతో 17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది.


By December 13, 2021 at 09:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-representative-harnaaz-sandhu-crowned-miss-universe-2021/articleshow/88248451.cms

No comments