Breaking News

Wuhan కోవిడ్ తొలి పేషెంట్ అకౌంటెంట్ కాదు.. ఆ మహిళే: తాజా స్టడీలో సంచలన విషయాలు


దాదాపు రెండేళ్లుగా ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కోవిడ్-19 మహమ్మారి తొలిసారి చైనాలోని వుహాన్‌‌లో వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే, కోవిడ్ బారినపడ్డ తొలి రోగి (Patient Zero) ఎవరనే విషయంపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. వుహాన్‌కు చెందిన ఓ అకౌంటెంట్‌ మొదటి పేషెంట్‌గా డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక పేర్కొన్నప్పటికీ.. అక్కడి సముద్ర ఉత్పత్తుల విక్రయ మార్కెట్‌లోని ఓ మహిళలోనే తొలుత కోవిడ్ లక్షణాలు కనిపించాయని తాజా అధ్యయనం పేర్కొంది. దీనికి సంబంధించిన నివేదిక తాజాగా సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు. దీంతో ఇప్పటివరకు కొవిడ్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)చేస్తున్న దర్యాప్తునకు తాజా నివేదిక ఓ సవాల్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. డిసెంబరు 2019లో మొట్టమొదటి సారిగా వుహాన్‌ నగరంలో బయటపడిన కరోనా వైరస్‌.. స్వల్ప కాలంలోనే యావత్‌ ప్రపంచాన్ని చుట్టేసి మహమ్మారిగా మారింది. వుహాన్‌లోని జంతువిక్రయ మార్కెట్‌లోని పలువురికి కొవిడ్‌ లక్షణాలు బయటపడ్డాయి. అయితే, తొలుత వైరస్‌ లక్షణాలు ఓ అకౌంటెంట్‌లో డిసెంబర్‌ 16న కనిపించాయని.. అతడిదే కరోనా తొలి కేసుగా ఇప్పటివరకు భావిస్తున్నారు. కానీ, దీనికి ముందే డిసెంబర్‌ 11న ఓ మహిళలో లక్షణాలు కనిపించాయని యూనివర్సిటీ ఆఫ్‌ ఆరిజొనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్‌ మైఖేల్‌ వోరోబే పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వుహాన్‌ మార్కెట్‌లో వైరస్‌ లక్షణాలు బయటపడినవారు, ఆస్పత్రిలో చేరిన వారి మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తే.. కోవిడ్‌ మూలాలు అక్కడే ప్రారంభమయ్యాయనే విషయం స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆ సమయంలో వెలుగు చూసిన సగానికిపైగా కేసులు ఆ మార్కెట్‌తో సంబంధమున్నవేనని.. కానీ ఆ అకౌంటెంట్‌కు మాత్రం మార్కెట్‌తో సంబంధమే లేదని వోరోబే గుర్తుచేశారు. వైరస్ జంతువుల నుంచే మనిషికి వ్యాపించినట్టు ఈ అధారాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. కొవిడ్‌ మూలాలపై అధ్యయనం కోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రత్యేక బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో వుహాన్‌లో పర్యటించింది. ఆ సమయంలో 2019లో కరోనా లక్షణాలు తొలుత వెలుగు చూసినట్లు భావిస్తోన్న అకౌంటెంట్‌ను ఇంటర్వ్యూ చేసింది. అనంతరం ఆయనదే తొలి కరోనా కేసు అని మార్చిలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. కానీ, డబ్ల్యూహెచ్‌ఓ విచారణ సందర్భంగా లక్షణాలు కనిపించిన అకౌంటెంట్‌ను తేదీ గురించి అడగలేదని ఆ బృందంలోని నిపుణుడు పీటర్‌ డజాక్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా , రద్దీ ప్రాంతంలో ఆ అకౌంటెంట్‌ తిరిగిన దాఖలాలు లేవన్నారు. చైనా అధికారులు చెప్పినట్లుగా ఆయనకు డిసెంబర్‌ 16న వైరస్‌ లక్షణాలు మొదలు కాకపోవచ్చని.. హుబే ఆస్పత్రి వైద్యులే ఆ తేదీని వెల్లడించారని అన్నారు. ఒకవేళ వోరోబే చెప్పినట్లుగా సముద్ర ఉత్పత్తులను విక్రయించే మహిళనే తొలి కేసు అయితే.. ఆ మహిళ ఏ దుకాణంలో పనిచేసింది? ఆ జంతువులు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? వంటి ప్రశ్నలకు సమాధానం వెతకాల్సి ఉందని పీటర్‌ డజాక్‌ పేర్కొన్నారు. కరోనా తొలి కేసు వుహాన్‌ మార్కెట్‌లోని వ్యక్తిదేనంటూ వోరెబే చేసిన పరిశీలనను డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందంలోని పీటర్‌తోపాటు చాలా మంది నిపుణులు ఏకీభవిస్తున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. అయినప్పటికీ మహమ్మారి ఎలా మొదలయ్యిందని చెప్పడానికి వోరేబ్ చూపుతున్న ఆధారాలు పూర్తిగా సరిపోవని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ మూలాలపై వివిధ కోణాల్లో మరింత పరిశోధన జరగాల్సి ఉందన్నారు. వుహాన్‌ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందనే సిద్ధాంతాన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది మే నెలలో సైన్స్‌ జర్నల్‌లో కాలమ్‌ను ప్రచురించిన 15 కంటే ఎక్కువ మంది వైరాలజిస్ట్‌లలో వోరోబే ఒకరు. తాజా కథనంలో కరోనా వ్యాప్తి మూలాలపై తన పరిశోధన ‘మహమ్మారి ప్రత్యక్షంగా జంతువు మార్కెట్ నుంచి పుట్టిందనడానికి బలమైన సాక్ష్యాలను అందిస్తుంది’ అని ఆయన వాదించారు.


By November 20, 2021 at 07:44AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/covid-outbreak-likely-to-origin-from-wuhan-sea-product-market-says-scintist/articleshow/87810124.cms

No comments