Breaking News

Diwali 2021 దివ్వెల వెలుగులో మెరిసిపోయిన అయోధ్య.. హెలికాప్టర్‌లో వచ్చిన సీతారాములు


దీపావళిని పురస్కరించుకుని అయోధ్యలో బుధవారం నిర్వహించిన దీపోత్సవం కనులపండువగా సాగింది. లక్షలాది దీపపు ప్రమిదల కాంతుల మధ్య సరయు నదీ తీరం సరికొత్త శోభను సంతరించుకుంది. ఏటా దీపావళి ముందు రోజున అయోధ్యలోని రామ్‌కీ పౌర్ ఘాట్‌లో దీపోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అయోధ్యలో 12 లక్షల మట్టి ప్రమిదలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం రామ్‌కీ పైడి ఘాట్‌లో 9 లక్షల దీపాలు, నగరంలోని వివిధ ప్రాంతాల్లోనూ మరో 3 లక్షల దీపాలను వెలిగించారు. రామమందిర నిర్మాణ స్థలంలో 50,000 వేల ప్రమిదలను వెలిగించారు. గతేడాది వెలిగించిన 6 లక్షల దీపాల రికార్డును తాజాగా అధిగమించినట్టయ్యింది. గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌కు సర్టిఫికెట్‌ను అందజేశారు. ఇక, దీపోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు సీతారాములు, లక్ష్మణుడు, భరతుడి వేషధారులు.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు హెలికాప్టర్‌లో అయోధ్యకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కళాకారులను సీఎం ఘనంగా సత్కరించారు. వారికి రాజ తిలకం దిద్దారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు, వియత్నాం, కెన్యా, ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో రాయబారులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫైర్‌క్రాకర్స్‌, లేజర్‌షో కట్టిపడేసింది. దీపోత్సవం సందర్భంగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది. కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రతిపక్షాలపై గత పాలకులపై విమర్శలు గుప్పించారు. 2023 నాటికి అయోధ్య రామాలయాన్ని నిర్మించి తీరుతామన్నారు.


By November 04, 2021 at 08:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ayodhya-glitters-with-diyas-as-state-observes-deepotsav-occiation-of-diwali-2021/articleshow/87519859.cms

No comments