Breaking News

సింగం స్టయిల్‌లో దొంగలను ఛేజ్ చేసి పట్టుకున్న ఎస్పీ.. వీడియో వైరల్


సింగం సినిమాను తలపించేలా చోరీ చేసి పారిపోతున్న దొంగలను ఎస్పీయే స్వయంగా వెంబడించి మరీ పట్టుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పల్లికొండకు చెందిన సతీశ్‌ అనే వ్యక్తి వెల్లూరు గ్రీన్‌ సర్కిల్‌ వద్ద టాటూ వ్యాపారం చేస్తుంటాడు. సాళవన్‌ ప్రాంతానికి చెందిన కిషోర్ (20), అతడి ఇద్దరి స్నేహితులు లింగేశ్వరన్ (18), బాలాజీ (18)లు కత్తులతో బెదిరించి సతీశ్, అక్కడకు వచ్చినవారి వద్ద ఉన్న సొమ్మును లాక్కుని బైక్‌పై పరారయ్యారు. ఈ సమయంలో అటుగా వాహనంలో వెళ్తున్న వెల్లూరు జిల్లా ఎస్పీ సెల్వకుమార్‌ కంటబడటంతో నిందితులను వెంబడించారు. వారి బైక్‌ను అడ్డగించాలని డ్రైవర్‌ను ఆదేశించారు. పోలీసు వాహనాన్ని చూసిన నిందితులు వేగంగా వెళ్లే క్రమంలో అదుపు తప్పి బోల్తాపడ్డారు. ఒకడు బైక్‌‌పై పారిపోగా.. మిగతా ఇద్దరు నిందితులు కాళ్లకు బుద్ధిచెప్పారు. అయితే, వారిని వదలకుండా ఎస్పీనే స్వయంగా వెంబడించి దొరకబుచ్చుకున్నారు. నిందితుల నుంచి రూ. 1,200 నగదు, సెల్‌ఫోన్, కత్తి, కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వెల్లూరు నార్త్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తప్పించుకున్న మరో నిందితుడిని ఘటన జరిగిన గంటలోపే పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులను అరెస్ట్‌ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్పీతో సహా పోలీసు సిబ్బందిని ప్రజలు అభినందించారు. గతంలో ఈ ముగ్గురూ మొబైల్ ఫోన్లు, పర్సులు, బంగారు గొలుసులు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. నిందితులపై కేసు నమోదుచేసిన పోలీసులు.. వెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.


By November 26, 2021 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-vellore-sp-arrests-three-robbers-after-a-brief-chase/articleshow/87922059.cms

No comments