Breaking News

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ‘నా పెద్దన్న’ అంటూ సిద్ధూ సంబోధన.. తీవ్ర దుమారం!


కాంగ్రెస్ పార్టీ నేత తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను తనకు‘పెద్దన్న’ అంటూ సంబోధించడం వివాదానికి కారణమయ్యింది. పాక్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా సందర్శించిన సిద్ధూకు పాక్ అధికారులు పూలమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు సిద్ధూ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలోనే ఇమ్రాన్‌ నాకు సోదరుడి లాంటి వాడని సిద్దూ అన్న వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ధన్యవాదాలు.. ఆయన (ఇమ్రాన్ ఖాన్) నాకు సోదరుడు లాంటివాడు.. నాకు పెద్దన్న’అని సిద్ధూ సంబోధించినట్టు వీడియోలో వినబడుతోంది. అంతేకాదు, 2018లో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను ఆలింగనం చేసుకున్న విషయాన్ని మాలవీయా గుర్తుచేశారు. ‘రాహుల్ గాంధీకి ఎంతో ప్రియమైన నవజోత్ సింగ్ సిద్ధూ... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ‘బడా భాయ్’ అని పిలిచారు. గతంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను కౌగిలించుకుని ప్రశంసలు కురిపించారు.. అనుభవజ్ఞుడైన అమరీందర్ సింగ్ కంటే పాకిస్థాన్‌ను ఇష్టపడే సిద్ధూను గాంధీలు (రాహుల్, ప్రియాంక) ఎన్నుకోవడంలో ఆశ్చర్యం ఉందా?’ అని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. అక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన అమరీందర్ సింగ్ సొంతంగా రాజకీయ పార్టీని పెట్టుకున్నారు. సాగు చట్టాల కారణంగా ఎన్‌డీఏ నుంచి విడిపోయిన అకాళీదళ్ తిరిగి బీజేపీతో పొత్తుకు నిరాకరించింది. కాగా, సిద్ధూ అంశంపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర స్పందిస్తూ.. సల్మాన్ ఖుర్షీద్ హిందూత్వను ISIS వంటి జీహాదీ గ్రూప్‌లతో పోల్చి రాసిన పుస్తకాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌వి ‘బుజ్జగింపు రాజకీయాలు’ అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌లోని ఇతర నేతలు కూడా హిందూత్వకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. భారత్ వల్ల హిందూత్వకు ముప్పు ఉందని అన్నారు.. ఇది పాక్ అనుకూల ప్రకటనలు ఇవ్వడానికి రూపొందించిన నమూనా’ సంబిత్ ధ్వజమెత్తారు. ఇక, సిద్ధూ వ్యాఖ్యలపై అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా విమర్శలు గుప్పించారు. ఇది దేశ సైనికుల త్యాగాలను పదే పదే అవమానించి, నిరుత్సాహపరచడమేనని మండిపడ్డారు. ఈ అంశంపై గాంధీ కుటుంబం పంజాబ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘సిద్ధూ మాట్లాడిన మాటలు ఆయన సొంత అభిప్రాయమా.. లేదా గాంధీ కుటుంబం తరఫున మాట్లాడాడా అన్నది వివరణ ఇవ్వాలి.. గాంధీ కుటుంబం రాష్ట్రంలో మళ్లీ రెచ్చిపోతుందనే విషయాన్ని పంజాబీలు తెలుసుకోవాలి’ అని సుఖ్బీర్ సింగ్ అన్నారు. మరో ప్రధాన పార్టీ ఆప్ సైతం విమర్శలు గుప్పించింది.


By November 21, 2021 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/punjab-pcc-chief-navjot-sidhu-calls-pakistan-pm-as-big-brother/articleshow/87827428.cms

No comments