పోలీస్ అధికారిని స్తంభానికి కట్టేసి.. చితకబాదిన పేకాటరాయుళ్లు!
ఓ పోలీస్ అధికారిపై కొందరు పేకాటాడుతున్న యువకులు దాడికి పాల్పడి, తాళ్లతో స్తంభానికి కట్టేసి చితకబాదారు. బిహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో దీపావళి రోజున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మోతిహరి పోలీస్స్టేషన్ పరిధిలోని ధరమ్పుర్ గ్రామంలో గొడవ జరుగుతోందని దీపావళి రోజు సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. కొంత మంది మద్యం సేవించి, పేకాటాడుతుండగా గొడవపడినట్టు తెలిసింది. దీంతో ఏఎస్ఐ సీతారాం దాస్ కొంత మంది పోలీసులు హుటాహుటిన అక్కడకు బయల్దేరి వెళ్లారు. అయితే, ఏఎస్ఐ అక్కడికి వెళ్లడంతో యువకులు రెచ్చిపోయారు. దీపావళి పండగ నాడు పోలీసులు పెట్రోలింగ్ ఎలా చేస్తారంటూ.. దుర్భాషలాడుతూ ఏఎస్ఐపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఓ ఇద్దరు యువకులు ఆయన చేతులను తాడుతో వెనక్కి విరిచి, కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. వివాదాన్ని పరిష్కరించడానికి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, ఏఎస్ఐ సీతారాంను గుంపు చుట్టుముట్టింది. ఆయనను విచక్షణారహితంగా కొట్టారు. మిగతా సిబ్బంది రావడంతో తర్వాత ఆయనను వదిలేయడంతో పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. అనంతరం పలువురు యువకులపై పోలీసులు కేసు నమోదుచేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఏఎస్ఐను కట్టేసి, చితకబాది ఫోన్లో వీడియో తీశారు. కెమెరా పట్టుకున్న ఓ యువకుడు దాడి చేయమని ఎవరు చెప్పారని, దీపావళి రోజున బీహార్లో ఎక్కడా పెట్రోలింగ్ జరగదని పదేపదే చెప్పడం వీడియోలో వినిపిస్తోంది.
By November 08, 2021 at 07:01AM
No comments