Breaking News

పఠాన్‌కోట్‌లో కలకలం.. ఆర్మీ క్యాంప్‌పై గ్రనేడ్‌ దాడి


పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ మరోసారి పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఆర్మీ క్యాంప్‌ సమీపంలోని త్రివేణి గేట్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున గ్రనేడ్‌ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలిన గ్రనేడ్‌ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతం గుండా వివాహా బరాత్ వెళుతున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు త్రివేణి గేట్ వద్ద గ్రనేడ్ విసిరారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో వెంటనే అన్ని చెక్ పోస్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ పేలుడులో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని.. తదుపరి విచారణ కొనసాగుతోందని సీనియర్ ఎస్పీ సురేంద్ర లాంబా తెలిపారు. మరోవైపు, ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. కాగా, 2016 జనవరిలో ఎయిర్ బేస్ మీద జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. ఈ దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ దాడిలో అంతర్గత శత్రువులు ఉన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. భారత భద్రతా దళాలు అంతం చేసిన ఆరుగురు ఉగ్రవాదుల్లో నలుగురు పాక్ నుంచి వచ్చారని అధికారులు గుర్తించారు.


By November 22, 2021 at 11:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/grenade-blast-took-place-near-triveni-gate-of-an-army-camp-in-pathankot/articleshow/87843121.cms

No comments