Breaking News

భూటాన్ భూభాగంలో 4 కొత్త గ్రామాలు నిర్మించిన చైనా.. బయటపెట్టిన ఉపగ్రహాలు!


విస్తరణవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా.. సరిహద్దుల్లోని పొరుగు దేశాల భూభాగాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తోంది. ఇటీవల కాలంలో భారత్ భూభాగంలో కొత్తగా ఓ గ్రామాన్ని ఏర్పాటుచేసినట్టు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా, భూటాన్ భూభాగంలోకి డ్రాగన్ సైన్యం ప్రవేశించినట్టు ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టాయి. భూటాన్ భూభాగంలో గతేడాదిలోనే నాలుగు గ్రామాలను చైనా నిర్మించినట్టు స్పష్టం చేస్తున్నాయి. భూటాన్ సరిహద్దుల్లో దాదాపు 100 చదరపు కిలోమీటర్ల పొడువునా కొత్త గ్రామాలున్నాయి. భారత్, భూటాన్, చైనా త్రికూడలి డోక్లామ్‌ వద్ద 2017లో ఇరు దేశాల సైన్యాల మధ్య దాదాపు మూడు నెలల పాటు ప్రతిష్టంభన కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో. భూటాన్ అభ్యంతరాలు ఏ మాత్రం పట్టించుకోకుండా చైనా ఏకపక్షంగా రోడ్డు నిర్మాణాలను ప్రారంభించింది. దీన్ని భూటాన్ తీవ్రంగా వ్యతిరేకించడంతో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని అనుసరించి ఆ దేశానికి భారత్ మద్దతుగా నిలిచింది. భూటాన్‌, భారత్ మధ్య చారిత్రాత్మక సంబంధాలు కొనసాగుతున్నాయి. భూటాన్ సైనికులకు భారత్‌లో శిక్షణ కూడా నిరంతరం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో భూటాన్ భూభాగంలో చైనా కొత్త నిర్మాణాలు మరోసారి భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు, చైనా నుంచి భూటాన్ నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. భూ సరిహద్దుల గురించి మళ్లీ చర్చలు జరపాలని కోరుతోంది. అయితే, కొత్త ఒప్పందం రూపురేఖలు పూర్తిగా తెలియరాలేదు. వారి భూభాగంలో ఈ కొత్త గ్రామాల నిర్మాణం ఒప్పందంలో భాగమేనా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్, చైనాల మధ్య మరో వివాదానికి తెరలేచే అవకాశాలు కనబడుతున్నాయి. డోక్లామ్‌లో నిర్మాణాన్ని భారత్ వ్యతిరేకించడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది. భవిష్యత్తులో చైనాతో సైనిక ఘర్షణ జరిగితే డ్రాగన్ సైన్యాలు ఈ రోడ్డును ఉపయోగించుకొని, వ్యూహాత్మకంగా కీలకమైన పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి కారిడార్‌ను చేజిక్కించుకుంటాయనే ఆందోళన భారత్‌లో ఉంది. సిలిగురి కారిడార్‌ను ఆ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని 'చికెన్స్ నెక్' అని పిలుస్తారు. ఈశాన్య భారత రాష్ట్రాలను భారత్‌లోని మిగతా భూభాగంతో కలిపేది ఈ ప్రాంతమే. 1950లలో చైనా టిబెట్‌ను ఆక్రమించుకొని, దానిని కలిపేసుకున్న వెంటనే, భూటాన్ భారత్ వైపు స్నేహహస్తం చాచింది. నాటి నుంచి భూటాన్- భారత్ ప్రభావం కిందే ఉంది.భూటాన్‌కు భారత్ ఆర్థిక, సైనిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. భారత్ సహాయాన్ని అందుకుంటున్న దేశాల్లో ఈ హిమాలయ దేశానిదే ప్రథమ స్థానం. గత పంచవర్ష ప్రణాళిక కింద భారత్, భూటాన్‌కు దాదాపు రూ.5 వేల కోట్ల సహాయాన్ని అందించింది. వందల మంది భారత సైనికులు భూటాన్‌లో ఉన్నారు. వాళ్లు భూటాన్ బలగాలకు శిక్షణ ఇస్తున్నారని అధికారులు చెబుతున్నారు. భూటాన్ సైనిక ప్రధాన కార్యాలయం డోక్లాంకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'హా'లో ఉంది. చాలా మంది భూటాన్ ప్రజలు కొన్ని దశాబ్దాలుగా భారత్ చేస్తున్న సాయంపై కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు.


By November 18, 2021 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/chinese-landgrab-on-bhutanese-territory-four-villages-constructied-in-one-year/articleshow/87770475.cms

No comments