Punjab Crisis ఆ హామీతో రాజీకి.. పీసీసీ చీఫ్గా కొనసాగనున్న సిద్ధూ!
పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ మెత్తబడ్డట్టు తెలుస్తోంది. పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీతో గురువారం భేటీ అనంతరం రాజీనామా విషయంలో వెనక్కు తగ్గినట్టు సమాచారం. గత ఎన్నికల ముందు పార్టీ ఇచ్చిన హామీలు ఎంత వరకూ నెరవేరాయనేది పరిశీలించడానికి సమన్వయ కమిటీ ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వడంతో సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడానికి సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, సిద్ధూ, సీనియర్ నేత హరీశ్ చౌదరితో ఈ కమిటీని ఏర్పాటుచేయనున్నారు. చండీగఢ్లోని పంజాబ్ భవన్లో జరిగిన సమావేశంలో సీఎం ఛన్నీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు పవన్ హోయెల్, ప్రగత్ సింగ్, హరీశ్ చౌదరీలు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ అనూహ్య రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభానికి పరిష్కారం దిశగా ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో పలు నియామకాలపై అలకబూనిన సిద్ధూ.. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాను ఆమోదించని అధిష్ఠానం.. ఈ సమస్యను రాష్ట్ర నాయకత్వమే పరిష్కరించుకోవాలని సీఎం చరణ్జిత్కు సూచించింది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం సిద్ధూతో ఫోన్లో మాట్లాడిన సీఎం చన్నీ.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని తెలియజేశారు. ఇందుకు అంగీకరించిన సిద్ధూ.. గురువారం మధ్యాహ్నం సీఎంతో భేటీ అయ్యారు. పంజాబ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో సిద్ధూ రాజీనామా వెనక్కి తీసుకుని, తిరిగి పీసీసీ బాధ్యతలు చేపట్టేలా ఆయన్ను ఒప్పించే ప్రయత్నంలో చన్నీ సఫలమైనట్టు తెలుస్తోంది. ఇక, భావోద్వేగంతోనే సిద్ధూ రాజీనామా చేసినట్టు కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. సిద్ధూ సలహాదారు మొహమద్ ముస్తాఫా మాట్లాడుతూ.. ‘సిద్ధూను కాంగ్రెస్ అర్థం చేసుకుంది.. కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆయన ఎప్పుడూ అతీతం కాదు.. ఆయన కాంగ్రెస్, పార్టీ నాయకత్వం గురించి ఎప్పుడూ ఆలోచించని అమరీందర్ సింగ్ కాదు’ అన్నారు. సిద్ధూ నేతృత్వంలోనే వచ్చే ఏడాది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందని వ్యాఖ్యానించారు.
By October 01, 2021 at 07:13AM
No comments