Breaking News

Diwali ఆ రకమైన టపాసులను కాల్చొద్దు.. బాణాసంచాపై సుప్రీం సంచలన ఆదేశాాలు


దీపావళి సందర్భంగా బాణాసంచాపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలు వెలువరించింది. బేరియం సాల్ట్ వినియోగించే టపాసులను వినియోగించవద్దని పేర్కొంది. అయితే, తాము అన్ని రకాల విధంచలేదని, బేరియం సాల్ట్ ఉపయోగించిన వాటికే అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో దేశంలో బాణసంచాపై పూర్తి స్థాయిలో నిషేధం విధించలేదని పేర్కొంది. ఉత్సవాల పేరుతో పర్యావరణానికి హానికరమైన టపాసులను కాల్చడానికి వీల్లేదని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏ ఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వేడుకల పేరుతో ఇతరుల ఆరోగ్యానికి హాని తలపెట్టడం సరికాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే అధికారం ఎవరికీ లేదని తెల్చిచెప్పింది. ప్రత్యేకించి సీనియర్ సిటిజన్లను దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. హరిత టపాసులకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. కాలుష్య కారక బాణసంచా ఉపయోగించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ అంశంపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ టీవీల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పింది. తాము జారీచేసిన ఆదేశాలను సంబంధిత రాష్ట్రాల అమలు ఏజెన్సీలకు అమలు చేయాలనే ఆసక్తి లేకపోయినా లేదా ఏవైనా కారణాల వల్ల నిర్లిప్తంగా ఉన్నట్టు ప్రాథమికంగా తేలితే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది. ‘‘బాణాసంచా విషయంలో గతంలో ఈ కోర్టు జారీ చేసిన ఆదేశాలు/ ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ సమర్పించిన ఒక నివేదిక ఉంది.. మేము వెలువరించిన ఆదేశాలను సంబంధిత తయారీదారులు నిర్ద్వంద్వంగా ఉల్లంఘించారని.. మార్కెట్లలో నిషేధిత బాణసంచా విక్రయాలు జరుగుతున్నాయని ప్రాథమికంగా తెలుస్తోంది.ఈ ఆరోపణలు నిజమని తేలితే చాలా తీవ్రమైనవి.. సహించలేనివి’’ అని వ్యాఖ్యానించింది.


By October 30, 2021 at 07:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-says-celebration-cannot-be-at-cost-of-health-over-cracker-ban/articleshow/87383651.cms

No comments