Breaking News

Delhi టిక్రీ బోర్డర్‌లో మహిళా రైతులపై దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు మృతి


సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని టిక్రీ వద్ద రైతులు ఆందోళనలు చేస్తున్న ప్రదేశంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా రైతులు మృతిచెందారు. రైతుల నిరసన వేదిక సమీపంలోని డివైడర్‌పై ముగ్గురు మహిళలు కూర్చుని ఉండగా.. వేగంగా వచ్చిన ట్రక్కు వారిని ఢీకొట్టింది. ముగ్గురు మహిళలూ ఆటోకోసం వేచి ఉన్న సమయంలో ప్రమాదం సంభవించింది. మహిళలపైకి అదుపుతప్పిన ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఘటనా స్థలిలో మృతిచెందారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతిచెందిన మహిళలను పంజాబ్‌లోని మన్సా జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. వీరు రైతుల ఆందోళనల్లో పాల్గొనడానికి పంజాబ్ నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. టిక్రీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల్లో పాల్గొన్న వీరు తిరిగి తమ స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. హరియాణాలోని బహదూర్‌గఢ్ వద్ద జరిగిన ఇదే ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కేసు నమోదుచేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఇక, ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతేడాది నవంబరు నుంచి రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.


By October 28, 2021 at 11:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/three-women-farmers-run-over-by-truck-near-tikri-protest-site-in-haryana/articleshow/87328667.cms

No comments