Breaking News

కోవిడ్ టీకాలో మరో మైలురాయికి చేరువలో భారత్.. వచ్చే వారం భారీగా ప్లాన్ చేస్తున్న కేంద్రం


దేశంలో కోవిడ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌లో భారత్ రోజు రోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా, మరో మైలురాయిని అందుకునేందుకు భారత్‌ సిద్ధమైంది. వచ్చే వారంలో 100 కోట్ల పూర్తిచేసుకొని వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో చారిత్రక మైలురాయి చేరనుంది. అక్టోబరు 19 లేదా 20 తేదీల్లో ఈ మైలురాయిని అందుకోనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచేలా అక్టోబరులో 28 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి చేయనున్నట్టు వెల్లడించారు. దేశంలో వ్యాక్సిన్‌కు అర్హులైన వారిలో 73 శాతం మందికి తొలి డోసు పూర్తయిందని, దాదాపు 29 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 8 కోట్లకు పైగా టీకా డోసులు ఉన్నాయని చెప్పారు. అక్టోబరులో ఉత్పత్తయ్యే 28 కోట్ల డోసుల్లో దాదాపు 22 కోట్ల కొవిషీల్డ్‌ కాగా.. మిగతా 6 కోట్ల డోసులు కొవాగ్జిన్‌కి చెందినవని వివరించారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా సుమారు 97 కోట్ల డోసుల పంపిణీ పూర్తయిందని, వచ్చే వారంలోనే 100 కోట్ల మైలురాయిని అధిగమిస్తామని తెలిపారు. అక్టోబర్‌ 19 లేదా 20 తేదీల్లో ఈ మైలురాయి చేరే అవకాశం ఉన్నట్టు చెప్పారు. కొవిన్‌ డ్యాష్‌బోర్డు ప్రకారం.. బుధవారం దేశవ్యాప్తంగా 30.25 లక్షల కొవిడ్‌ డోస్‌లను పంపిణీ చేశారు. దీంతో దేశంలో మొత్తం 96.7 5కోట్ల డోసులు పూర్తయ్యాయి. 100 కోట్ల టీకా డోస్‌ల పంపిణీ మైలురాయికి బీజేపీ భారీగా ప్లాన్ చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో దీనిని మరింత అట్టహాసంగా నిర్వహించి, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యూపీ, పంజాబ్, గుజరాత్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 27.27 కోట్ల మందికి రెండు డోస్‌ల టీకా పూర్తయ్యింది. టీకాల ఎగుమతికి ప్రస్తుతం ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. దేశంలోని ప్రజలకు అందజేయగా ఏమైనా మిగిలి ఉంటే ఎగుమతులపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. భారత్‌తో బూస్టర్‌ డోసుల వినియోగంపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు మాత్రమే బూస్టర్ డోసు అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విషయాన్ని సదరు అధికారి గుర్తుచేశారు.


By October 14, 2021 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-plans-outreach-to-mark-100-crore-vaccine-doses-focus-on-poll-bound-states/articleshow/87011612.cms

No comments