Breaking News

ఒంటరిగా ఉన్న యువతి.. దూరపు బంధువులమని ఇంటిలోకి వచ్చి దోచేసిన ఖతర్నాక్ జంట!


దూరపు బంధువులమని ఇంటికి వచ్చిన ఓ జంట.. దొంగతనానికి పాల్పడింది. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటకొచ్చిన జంట.. తాము దూరపు బంధువులమని, పెళ్లికి పిలవడానికి వచ్చామని చెప్పారు. అనంతరం ఆమెను బంధించి ఇంటిలో ఉన్న రూ.2.5 లక్షల విలువైన బంగారం, రూ.1.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన చెన్నైలోని తంబారంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగరమథన్ కురింజి నగర్‌లో నివాసం ఉండే రవి కార్పెంటర్‌‌గా పనిచేస్తున్నాడు. భార్య సుగుణ, కుమార్తె పుష్పలత డిగ్రీ చివరి ఏడాది చదువుతోంది. శనివారం రవి పనికోసం వెళ్లిపోగా.. భార్య వేరే ఊరు వెళ్లింది. దీంతో ఇంట్లో కుమార్తె ఒక్కర్తే ఉండగా.. 30-35 ఏళ్లలోపు ఉండే ఓ మహిళ, పురుషుడు వచ్చారు. ముఖానికి మాస్క్ ధరించిన వీరు.. తాము రవికి దూరపు బంధువులమని పరిచయం చేసుకున్నారు. తర్వాత ఇంట్లో వివాహం జరుగుతోందని.. కుటుంబాన్ని పిలవడానికి వచ్చామని తెలిపారు. తమ వెంట తెచ్చి సంచిలో నుంచి ప్లేట్ తీసి, అందులో పళ్లు, ఓ పెళ్లికార్డు ఉంచారు. తర్వాత దాహంగా ఉందని మంచి నీళ్లు అడిగిన ఈ జంట.. ఆహ్వాన పత్రికను అందజేస్తున్నట్టు నటించి, కత్తిని మెడపై పెట్టి బెదిరించారు. అరిస్తే చంపుతామని బెదిరించి, నోట్లో గుడ్డలు కుక్కి కట్టేశారు. యువతి వద్ద బీరువా తాళాలు తీసుకుని, అందులో ఉన్న బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. రాత్రి 7 గంటల సమయంలో ఇంటికొచ్చిన సుగుణకు పుష్పలత అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆందోళన చెందింది. ఆమె ముఖంపై నీళ్లు జల్లి లేవనెత్తింది. తర్వాత అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంటికి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. యువతి ఒంటిరిగా ఉందని తెలిసే ఇంటికి వచ్చారని, నిందితులు చుట్టుపక్కల ఉండేవారని అనుమానిస్తున్నారు.


By October 25, 2021 at 10:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamil-nadu-home-alone-girl-robbed-by-fake-relatives-in-tambaram-of-chennai/articleshow/87249262.cms

No comments