Breaking News

పునీత్‌కు కన్నీటి వీడ్కోలు.. అశ్రు నయనాల నడుమ ముగిసిన స్టార్ హీరో అంత్యక్రియలు


కన్నడ పవర్‌ స్టార్‌ శుక్రవారం గుండెపోటుతో మరణించడంతో యావత్ సినీ ఇండస్ట్రీ షాక్ అయింది. ఉదయం జిమ్‌ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఆయన ఆసుపత్రికి తరలించాక చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పునీత్‌ మరణవార్త సౌత్ ఇండియాలో సినీ ప్రేక్షకులను తీవ్రంగా కలచివేసింది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇక శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునీత్‌ అంతిమ దర్శనానికి తెలుగు, తమిళ చిత్రసీమలకు చెందిన నటీనటులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కంఠీరవ మైదానంలో పునీత్ భౌతిక కాయానికి నివాళులర్పించి శ్రద్థాంజలి ఘటించారు. బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ పునీత్‌ పార్ధివ శరీరాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అయితే నిన్న (శనివారం) సాయంత్రమే పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరగాల్సి ఉండగా.. ఆయన పెద్ద కూతురు అమెరికా నుంచి వచ్చేందుకు ఆలస్యం కావడం వల్ల నేటి తెల్లవారు జామున పునీత్ అశ్రు నయనాల నడుమ పునీత్ అంత్యక్రియలు జరిపారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. పునీత్‌ పార్థివ దేహంపై కాసేపు జాతీయ జెండాను కప్పి ఉంచి, అనంతరం ఆ పతాకాన్ని పునీత్‌ భార్యకు అందజేశారు. కంఠీరవ స్టూడియోస్‌‌లోని తండ్రి సమాధి దగ్గరే ఆయన కూడా సమాధి అయ్యారు. ఈ అంతిమయాత్రలో కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎంలు యడ్యూరప్ప, సిద్దరామయ్యలతో పాటు పలువురు మంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని పునీత్‌కు కడసారి వీడ్కోలు పలికారు. పునీత్ భార్య అశ్విని, కుమార్తెలు వందిత, ధృతి, సోదరుడు శివరాజ్‌కుమార్ రోదనలు పలువురి చేత కంటతడి పెట్టించాయి.


By October 31, 2021 at 08:25AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/puneeth-rajkumar-last-rites-finished-in-kanteerava-studios/articleshow/87415876.cms

No comments