Breaking News

శశికళ నటనకు ఆస్కారం పక్కా కానీ, పార్టీలో మాత్రం..: అన్నాడీఎంకే ఘాటు వ్యాఖ్యలు


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు .. శనివారం మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్, జయ స్మారకాల వద్ద నివాళులర్పించిన విషయం తెలిసిందే. జయలలిత స్మారకం వద్ద భావోద్వేగానికి గురయిన ఆమె.. కంటితడిపెట్టుకున్నారు. అమ్మతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటితో అంజలి ఘటించారు. శశికళ రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు వెలువడుతుండగా.. తన వాహనంపై జెండాతో అమ్మ స్మారకం వద్దకు చేరుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఆమె అభిమానులు అన్నాడీఎంకే జెండాలతోనే స్వాగతం పలికిన నేపథ్యంలో ఆ పార్టీ స్పందించింది. ఆమెకు తమ పార్టీలో స్థానంలేదని పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డి.జయకుమార్‌ మాట్లాడుతూ.. శశికళ ‘అమ్మ’ స్మారకం వద్దకు వచ్చినంత మాత్రాన రాజకీయ ప్రభావమేమీ ఉండదని కొట్టిపారేశారు. జయలలిత వల్ల లబ్ధి పొందినవారిలో ఆమె కూడా ఒకరని, ఒకవేళ శశికళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఏఎంఎంకే సరైన వేదిక అని చెప్పారు. అంతేకాదు, జయలలిత స్మారకం వద్ద శశికళ నటనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చేమో గానీ తమ పార్టీలో మాత్రం ఆమెకు చోటులేదని ఆయన తేల్చి చెప్పారు. గతంలోనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను ఆ పార్టీనుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇక, అక్రమాస్తుల కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత శశికళ అనూహ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి తర్వాత కార్యకర్తలతో శశికళ ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలు బయటికి వచ్చాయి. పార్టీని కచ్చితంగా కాపాడుతానంటూ ఆమె భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో శశికళ శనివారం జయలలిత, ఎంజీఆర్, అన్నాదురై స్మారకాల వద్ద నివాళులర్పించడం ఆసక్తిగా మారింది. జయ సమాధి వద్ద నివాళులర్పించిన చిన్నమ్మ.. ‘ఎంజీఆర్, జయలలితలు పార్టీని, కార్యకర్తలను కాపాడుతారు.. మంచి భవిష్యత్తు ఉంది.. అమ్మ స్మారకం వద్ద నా హృదయంలోని భారాన్ని దింపేసుకున్నాను.. అమ్మ ఎల్లప్పుడూ తమిళనాడు ప్రజలు, పార్టీ కోసం శ్రమించారు’ అని వ్యాఖ్యానించారు.


By October 17, 2021 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/aiadmk-response-about-vk-sasikala-tributes-at-jayalalithaa-memorial/articleshow/87076756.cms

No comments