Breaking News

డ్రగ్స్ బానిసలకు గుండు కొట్టించి.. కడుపు మాడ్చి.. తాలిబన్ల మరో అనాగరిక చర్య


తాలిబన్ల అరాచకానికి నిదర్శనంగా నిలిచే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్‌కు బానిసలైన వారి పట్ల అత్యంత అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. మత్తుకు బానిసైనవారిని బాధితులుగా పరిగణించి సరైన వైద్య చికిత్స అందించాల్సి ఉండగా, అనాగరిక చర్యలకు పాల్పడటం ఆందోళన రేకెత్తిస్తోంది. కాబూల్‌లో వేలాది మంది నిరాశ్రయులు హెరాయిన్‌ లాంటి డ్రగ్స్‌కు ఏళ్ల తరబడి అలవాటు పడ్డారు. దీనివల్ల వారి శరీరాలు చిక్కి శల్యమై, కళ్లలో జీవం కోల్పోయి జీవచ్ఛవాల్లా కనిపిస్తున్నారు. వారిలో చాలా మంది రహదారుల వంతెనల కింద తలదాచుకుంటుంటారు. తాలిబన్‌ పోలీసులు రాత్రిపూట ఆకస్మిక దాడులు జరిపి డ్రగ్స్‌ బానిసలను అదుపులోకి తీసుకుంటున్నారు. వారికి కాళ్లూ చేతులు కట్టేసి బలవంతంగా ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు. వారి వద్ద ఉన్న వస్తువులను తీసుకుని, తగులబెడుతున్నారు. మొండికేసినవారిని దారుణంగా కొడుతూ.. జైళ్లను తలపించే ఆ శిబిరాల్లో ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. డ్రగ్స్ వాడకాన్ని వదిలివేయాలని లేకపోతే చావుదెబ్బలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బలవంతంగా వారికి గుండు కొట్టించి సరైన ఆహారం కూడా పెట్టకుండా ఆకలితో అలమటించేలా చేస్తున్నారు. ఇస్లాం ప్రకారం మత్తు పదార్థాల వ్యసనపరులను సమాజ వినాశకారులని, ఆ అలవాటును మానిపించడానికి ఇలాంటి కర్కశ విధానాలే సరైన మార్గమని భావిస్తున్నారు. ఈక్రమంలో కొందరు చనిపోయినా తప్పేం లేదని, మిగతావాళ్లు మంచి వ్యక్తులుగా మారుతారని ప్రకటిస్తున్నారు. ఇక, ప్రపంచంలోని అత్యధికంగా హెరాయిన్‌ను ఉత్పత్తి దేశాల్లో ముందుంది. తాలిబన్ల అభిప్రాయం ప్రకారం డ్రగ్స్ వినియోగం సమాజానికి ఓ మచ్చ వంటింది. ‘వారు మన దేశస్థులు.. వారు మా కుటుంబం... వారి లోపల మంచి వ్యక్తులు ఉన్నారు.. దేవుడు కోరుకుంటే వారికి చికిత్స ద్వారా నయం చేయవచ్చు... కొంత మంది తమను వదిలిపెడితే మళ్లీ డ్రగ్స్ తీసుకోమని హామీ ఇచ్చారు.. స్వతహాగా కవి అయిన ఒక వృద్ధుడు తన అభిప్రాయాన్ని చెప్పడానికి కవితలు రాసిచ్చినా అది పని చేయలేదు’ అని ఓ వ్యక్తి అన్నారు. చివరికి మొత్తం 150 మందిని కాబుల్ శివారులోని అవిసెన్నా మెడికల్ హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు. అవిసెన్నా ఆస్పత్రికి చెందిన ఫాజల్‌రబీ మయర్ అనే వైద్యుడు మాట్లాడుతూ.. ఇక్కడెలాంటి ప్రజాస్వామ్యం లేదు.. అంతా నియంతృత్వమే.. బలవంతంగా వీరికి వైద్యం చేయడం ఒక్కటే మార్గం అన్నారు. ‘సాధారణంగా మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారికి చికిత్సలో ఉపయోగించే ప్రత్యామ్నాయ ఓపియాయిడ్లు, బుప్రెనోర్ఫిన్ మెథడోన్ వంటి ఔషధాలు లేవని ఆసుపత్రిలో ప్రధాన మానసిక వైద్యుడు వహెదుల్లా కోషన్ తెలిపారు. ఈ ప్రక్రియలో ఆకలి ప్రధానంగా ఉంటుందని తెలిపారు. సరైన ఆహారం అందించాలని అన్నారు.


By October 11, 2021 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/afghanistan-taliban-round-up-drug-addicts-and-shave-their-heads-in-forced-rehabilitaion-centres/articleshow/86927829.cms

No comments