Breaking News

పెట్రోల్‌కు బదులు వైన్‌, జున్నుతో నడుస్తున్న బ్రిటన్ యువరాజు కారు!


మద్యం తాగి వాహనం నడపడం నేరం.. మరి వాహనమే మద్యం సేవించి రోడ్లపై పరుగులు తీస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. స్వయంగా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్జెస్ తన కారు మద్యంతో నడుస్తోందని ప్రకటించారు. రాజసౌధంలో మిగిలిపోయిన వైన్‌ను పోసి ఆస్టోన్ మార్టిన్ కారులో యువరాజు చక్కర్లు కొడుతున్నారు. వాహనాలకు ఇంధనంగా డీజిల్‌, పెట్రోల్‌, సీఎన్‌జీ గ్యాస్‌లను వినియోగిస్తారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తుతో నడిచే వాహనాల వినియోగం పెరుగుతోంది. అయితే, బ్రిటన్ యువరాజు ప్రిన్స్‌ ఛార్లెస్‌ (72) వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన ఆస్టోన్ మార్టిన్ కారును వైన్‌తో నడిపిస్తున్నారు. 50 ఏళ్ల కిందట తన 21వ పుట్టిన రోజు నాడు బహుమతిగా అందుకున్న ఆస్టోన్ మార్టిన్ కారంటే ప్రిన్స్‌ చార్లెస్‌కు ఎంతో ఇష్టం. దీంతో కారును పెట్రోల్, డీజిల్‌తో కాకుండా ఇతర ఇంధనంతో శక్తివంతంగా నడిచేలా మార్పులు చేయాలని ఆస్టన్ మార్టిన్ సంస్థను కోరారు. ఇది పర్యావరణహితంగా ఉండాలని, వాహనం నుంచి వెదజెల్లే పొగ సువాసన భరితంగా ఉండాలన్నారు. ఆయన అభిరుచులకు తగ్గట్లుగా ఇంజినీర్లు తీవ్రంగా శ్రమించి.. ఈ కారును వైన్‌తో నడిచేలా రీడిజైన్‌ చేశారు. వారి కృషి ఫలితంగా యువరాజు కారు వైన్‌తో నడుస్తోంది. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో మిగిలిపోయిన వైన్‌ను ఇంధనంగా వాడుతున్నారు. కొన్నిసార్లు జున్ను తయారీ చేస్తుండగా విరిగిపోయిన పాలను సైతం ఈ కారులో ఇంధనంగా వాడటం గమనార్హం. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్ ఈ విషయాలను వెల్లడించారు. కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రపంచ నేతలు చేస్తున్న కృషికి తన వంతు సహకారంగా పెట్రోల్‌, డీజిల్‌ బదులు వైన్‌ను ఉపయోగిస్తున్నానని ప్రిన్స్‌ తెలిపారు. అక్టోబరు 31న వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. దీనిపై యువరాజు మాట్లాడుతూ.. భూగోళాన్ని రక్షించేందుకు ఐరాస జీవవైవిద్య శిఖరాగ్ర సమావేశంలో దేశాలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.


By October 14, 2021 at 11:30AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/britain-prince-charles-aston-martin-car-runs-on-fuel-made-from-wine/articleshow/87013759.cms

No comments