Breaking News

పాక్ చేతిలో భారత్ ఓటమి.. పంజాబ్‌లోని కశ్మీర్ విద్యార్థులపై దాడి


టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అయితే, భారత్ ఓడిపోయిందనే అక్కసుతో తమపై కొందరు దాడులకు పాల్పడ్డారని కశ్మీర్‌కి చెందిన విద్యార్థులు అరోపించారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌ భాయ్ గురుదాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. ఓ కశ్మీరీ విద్యార్ధి దాడి గురించి వివరిస్తూ.. ‘మేము ఇక్కడ మ్యాచ్ చూస్తున్నాం.. యూపీకి చెందిన విద్యార్థి అడ్డుపడ్డాడు.. మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం.. మే కూడా భారతీయులమే.. మాకు ఏమి జరిగిందో మీరు చూడండి... మేము భారతీయులం కాదా? కాబట్టి మోదీ ఏం చెబుతారు?’ అని అతడు నిలదీశాడు. గదిలో వస్తువులను పడేసి పగలుగొట్టారని ఆరోపించాడు. దాడికి సంబంధించిన వీడియోలను విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హాస్టల్ గదుల్లోని కుర్చీలు విరిగిపోయి, బెడ్స్ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. ఒకరిపై ఒకరు చేయిచేసుకుంటున్నట్టు వీడియోల్లో కనిపిస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, భారత్ ఓడిపోయిన తర్వాత స్టంపులను పట్టుకుని ఓ గుంపు విధ్వంసానికి పాల్పడుతున్నట్టు మరో వీడియోలో కనబడుతోంది. కాగా, దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే భావోద్వేగాలతో నిండిపోయి ఉంటుంది.


By October 25, 2021 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kashmiri-students-allegedly-attacked-at-punjab-after-india-pakistan-match/articleshow/87250719.cms

No comments