Breaking News

రైతుల డిమాండ్ల నెరవేర్చకుంటే బీజేపీకీ ఓటమే.. మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు


సాగు చట్టాలు, జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను ఉద్దేశించి మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల డిమాండ్లను నెరవేర్చాలని, లేకుంటే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో సోమవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ నేతలు పలు గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నారు.. నాది మీరట్... ఆ ప్రాంతంలోని బీజేపీ నాయకులు ఏ గ్రామానికీ వెళ్లలేకపోతున్నారు.. మీరఠ్‌, ముజఫర్‌నగర్‌, బాఘ్‌పట్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది’’ అని పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా మాట్లాడుతున్న మీరు గవర్నర్ పదవికి రాజీనామా చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సత్యపాల్‌ మాలిక్‌ స్పందిస్తూ.. ‘‘నేను రైతుల తరఫున నిలబడతా.. అందుకోసం నా పదవి వదులుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ అవసరమే వస్తే ఆ పని కూడా చేస్తాను’’ అని బదులిచ్చారు. పశ్చిమ యూపీలోని జాట్‌ సామాజిక వర్గానికి చెందిన సత్యపాల్‌ మాలిక్‌.. గతంలోనూ సాగు చట్టాల విషయంలో రైతులకు మద్దతుగా మాట్లాడారు. ‘‘ఈ అంశంపై పలువురు కేంద్ర పెద్దలు, నేతలతో గొడవపడ్డాను.. ప్రధాని, హోంమంత్రి ప్రతిఒక్కరితోనూ తన వైఖరిని చెప్పాను.. రైతుల విషయంలో మీరు తప్పు చేస్తున్నారు.. అలా చేయొద్దు’’ అని వారితో చెప్పినట్టు తెలిపారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర విషయంలో కేంద్రం చట్టబద్ధమైన హామీని ఇస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని మాలిక్‌ అభిప్రాయపడ్డారు. అలాగే, మూడు సాగు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించినందున రైతులు కూడా ఆ అంశాన్ని వదిలేయాలని సూచించారు. ఒకవేళ, కేంద్రం కనీస మద్దతు ధర చట్టబద్ధతకు హామీ ఇస్తానంటే.. తాను రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ‘నేను ప్రధాన మంత్రికి బహిరంగంగా ఎటువంటి సందేశం ఇవ్వాలనుకోవడం లేదు.. కానీ నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాను... ముఖ్యంగా సిక్కుల గురించి వారికి తెలిసుండకపోవచ్చు.. మొఘల్ చక్రవర్తులతో ఆయుధాలు లేకుండానే సిక్కు గురువులు పోరాటం చేశారు.. కాబట్టి వారు ఇబ్బంది పడకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఇక, జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జరుగుతున్న పౌర హత్యలపైనా ఆయన స్పందించారు. తాను గతంలో జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో శ్రీనగర్‌కు 50- 100 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చేందుకు ఉగ్రవాదులు ధైర్యం చేయలేదని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు మాత్రం పేద ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారని.. ఇది బాధాకరమన్నారు.


By October 19, 2021 at 07:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-govt-wont-return-to-power-if-farmers-demands-not-met-says-meghalaya-governor-satya-pal-malik/articleshow/87126162.cms

No comments