Breaking News

భారత్, పాక్ సహా 11 దేశాలకు అధిక ముప్పు.. వాతావరణ మార్పులపై అమెరికా సంచలన నివేదిక


ఇటీవల కేరళ, ఉత్తరాఖండ్ సహా దేశంలో ప్రకృతి వైపరీత్యాలు ఆందోళన కలిగిస్తుండగా.. అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. భారత్, పాకిస్థాన్ సహా 11 దేశాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే పర్యావరణ, సామాజిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో సంసిద్ధత, ప్రతిస్పందించే సామర్థ్యంలో అత్యంత వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. వాతావరణ మార్పులపై తొలిసారిగా అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ అంచనా (NIE)ను రూపొందించింది. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల పథాన్ని నిర్ణయించడంలో భారత్, చైనా కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించింది. అయితే, ఈ సంక్షోభాన్ని నివారించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపింది. అలాగే, 2040 వరకూ గ్లోబల్ వార్మింగ్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా జాతీయ భద్రతకు ముప్పును పెంచుతుందని హెచ్చరించింది. ‘అత్యధికంగా కర్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో, భారత్ నాల్గో స్థానంలో ఉన్నాయి.. పునరుత్పాదక, తక్కువ కర్బన్ వనరులను వినియోగిస్తామని చెబుతూనే ఈ రెండు దేశాలు వాటి మొత్తం, తలసరి ఉద్గారాలను పెంచుతున్నాయి.. అయితే, రెండు, మూడు స్థానాల్లో ఉన్న అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు ఉద్గారాలను తగ్గిస్తున్నాయి’ అని నివేదిక పేర్కొంది. ‘కర్బన ఉద్గారాల పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్న బొగ్గు వినియోగం ఖర్చు ఇతర ఇంధన వనరులతో పోలిస్తే తక్కువ.. అలాగే, ఉపాధి కల్పన కోసం బొగ్గు పరిశ్రమలపై ఆధారపడటం అనేది మిగతా వాటిని పరిమితం చేస్తున్నాయి.. అమెరికా విషయంలో ఇది నిజమైంది’ అని నివేదిక పేర్కొంది. ప్రపంచ వాతావరణ మార్పులపై గ్లాస్గో వేదికగా కొద్ది రోజుల్లో సమావేశం జరగనుండగా.. అమెరికా నిఘా నివేదిక విడుదల కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ‘అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఆశించిన సహకారాల మధ్య దీర్ఘకాల దౌత్యపరమైన విభజన కొనసాగుతుందని’ నివేదిక అస్పష్టంగా అంచనా వేసింది. అభివృద్ధి చెందిన దేశాలు తప్పనిసరిగా ఆర్థిక సహాయాన్ని అందించాలని పేర్కొంటూ అభివృద్ధి చెందుతున్న దేశాలు దాదాపుగా షరతులతో కూడిన లక్ష్యాలను సమర్పిస్తూనే ఉంటాయి. పారిస్ ఒప్పందం ప్రకారం సాంకేతిక సాయం, ఎన్‌డీసీ లక్ష్యాలను చేరుకోవడానికి సామర్ధ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. గతేడాది నుంచి 100 బిలియన్ డాలర్లు సమీకరించడంలో అభివృద్ధి చెందిన దేశాలు విఫలం కావడంతో సామర్థ్యాన్ని దెబ్బతీసింది. భారత్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ సహా 11 దేశాలలో ‘పరిస్థితి ఆందోళనకరంగా’ ఉందని గుర్తించింది. ‘ఈ దేశాలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తీవ్రమైన వాతావరణ మార్పులకు దారితీసి ఆహారం, నీరు, ఆరోగ్య భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.. తరచుగా, తీవ్రమైన తుఫానులు సంభవించి నీటి వనరులను కలుషితం చేసే అవకాశం ఉంది.. దీని వల్ల ప్రజలు అనారోగ్యానికి గురికావడం, అంటు వ్యాధుల బారిపపడే ముప్పును పెంచుతుంది’ అని హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం.. ‘ఆర్కిటిక్ వెలుపల భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉపరితల, భూగర్భజలాల బేసిన్‌ల కోసం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతాయి.. ఎందుకంటే పెరిగిన వాతావరణ వైవిధ్యం ముందున్న పరిస్థితులను తీవ్రతరం చేస్తుంది లేదా కొత్తగా నీటి సంక్షోభాన్ని ప్రేరేపిస్తుంది’ అని తెలిపింది. ఘర్షణ జరిగే ప్రదేశాలను గుర్తించడానికి ఖచ్చితమైన శాస్త్రీయ అంచనా లేదని నివేదిక చెబుతున్నప్పటికీ, నీటి వనరుల కోసం భారతదేశంలో ఉద్భవించే భారీ హిమానీనదాల నదులపై పాకిస్థాన్ ఆధారపడుతుంది.. వరదల సమయంలో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి, గ్రామాలను ఖాళీచేయించాలంటే నదుల నుంచి విడుదలయ్యే జలాల డేటా భారత్ నుంచి అవసరమవుతుందని నివేది పేర్కొంది.


By October 23, 2021 at 07:36AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/india-pakistan-among-11-countries-of-high-risk-and-concern-says-us-intel-report-on-climate/articleshow/87216725.cms

No comments