బాలిక తలపై సుత్తితో కొట్టి.. పలుమార్లు అత్యాచారం.. మృగాడు రాక్షసానందం
మహారాష్ట్రలో మహిళలపై వరుస అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముంబైలో ఓ మహిళ నిర్బయ తరహాలో హత్యాచారానికి గురైన మర్నాడే మరో బాలికపై అత్యాచారానికి గురయ్యింది. ఠాణె జిల్లా ఉల్హాసనగర్లో రైల్వేస్టేషన్ ఆవరణలో ఓ మైనర్ బాలిక (15)పై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బాధితురాలిపై సుత్తితో దాడిచేసి, అనంతరం అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు షిరిడీ నుంచి తిరిగొస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. షిర్డీ నుంచి రైలు దిగిన బాలిక ఉల్హాసనగర్కు వెళ్లే లోకల్ రైలెక్కింది. అక్కడకు చేరిన తర్వాత స్నేహితులతో కలిసి రైల్వేస్టేషన్లోని స్కైవాక్ మీదుగా ఇంటికి వెళ్తుండగా ఓ దుండగుడు సుత్తితో బెదిరించాడు. ఆమె స్నేహితులు పారిపోవడంతో బాలిక అతడి చేతికి చిక్కింది. దుండగుడు ఆమె తలపై సుత్తితో కొట్టి, అత్యాచారం చేశాడు. రాత్రంతా ఆమెను అక్కడే బంధించి పలుమార్లు అకృత్యానికి పాల్పడ్డాడు. శనివారం తెల్లవారుజామున ఆ ప్రాంతం ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అయితే, ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు తిప్పి పంపారు. మరో స్టేషన్కు వెళ్లినా అదే అనుభవం ఎదురైంది. చివరకు రైల్వే పోలీసులను బాధితురాలు ఆశ్రయించడంతో కేసు నమోదుచేశారు. నిందితుడిని ప్రత్యేక బృందం ఉల్హాసనగర్లోనే శనివారం రాత్రి అరెస్టు చేసింది. అతడిని నిర్మాణ పనులు చేసే కూలీ శ్రీకాంత్ గైక్వాడ్ (30)గా గుర్తించారు. కేసు నమోదు అనంతరం అతడిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా మంగళవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. బాధితురాలు, ఆమె స్నేహితులు కేకలు వేయగా.. చంపుతానని బెదిరించాడు. భయపడినవారు అక్కడ నుంచి పారిపోయారు. పక్కనే నిర్మానుష్యంగా ఉన్న రైల్వే క్వార్టర్స్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. కాగా, రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అత్యాచారం, హత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించాలని మహారాష్ట్ర డీజీపీ సంజయ్ పాండే ఆదేశాలు జారీచేశారు. నిందితులను తక్షణం అరెస్టు చేసి 60 రోజుల్లోపు చార్జిషీటు దాఖలు చేయాలని ఆదివారం ఫేస్బుక్ పోస్టులో ఆయన సూచించారు.
By September 13, 2021 at 08:03AM
No comments