Breaking News

‘మా చెప్పులు మోయడానికి తప్ప అధికారులు ఎందుకూ పనికిరారు’ మాజీ సీఎం వ్యాఖ్యలపై దుమారం


తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలో నిలిచే సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మరోసారి నోరుజారారు. అధికారులు తమ చెప్పులు మోయడానికి తప్ప ఎందుకూ పనికిరారు.. వారిని అందుకే ఉపయోగిస్తామని ఆమె వ్యాఖ్యానించారు. కులాల ఆధారంగా జనగణన చేయాలన్న డిమాండ్‌తో తనను కలిసిన స్థానిక ఓబీసీ నాయకుల బృందంతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమా భారతి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై దుమారం రేగడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. ‘‘నాయకులు.. అధికారులు చెప్పినట్లు నడుచుకుంటారని అనుకుంటున్నారా? కానే కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా మేం చర్చించుకుంటాం.. ఆ తర్వాత వాళ్లు ఫైల్‌ సిద్ధం చేస్తారు.. అంతేగానీ, వాళ్లు మమ్మల్ని కంట్రోల్‌ చేయడమేంటి? అసలు వాళ్ల సామర్థ్యం ఎంత? పదకొండేళ్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్న నన్ను అడిగితే పోస్టింగులు, జీతాలు ఇచ్చేది మేమే.. ప్రమోషన్లయినా, డిమోషన్లయినా మేమే ఇవ్వాలి.. వాళ్లేం చేస్తారు? మా చెప్పులు మోయడానికి మాత్రమే వాళ్లను అనుమతిస్తాం.. నిజం ఏంటంటే.. మా రాజకీయాలకు మేమే వాళ్లను వాడుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు. ఉమా భారతి వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఆమె దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ‘అధికారులు రాజకీయ నేతల చెప్పులు మోస్తున్నారా? అనేది ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టత ఇవ్వాలి’ అని కాంగ్రెస్ నేత కేకే మిశ్రా డిమాండ్ చేశారు. ఇక, తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన ఉమా భారతి.. క్షమాపణలు చెప్పారు. అయితే, పూర్తి వీడియోను వింటే నా వ్యాఖ్యల్లో వాస్తవం తెలుస్తుందని అన్నారు. ‘భోపాల్‌లోని నా నివాసంలో వెనుకబడిన తరగతుల ప్రతినిధి బృందాన్ని కలిశాను.. ఈ సమావేశం అధికారికంగా జరగలేదు. ఆ సంభాషణ మొత్తం వీడియో మీడియాలో వైరల్ అయింది.. నేను అధికారులకు మద్దతుగా మాట్లాడుతున్నందున నా పూర్తి వీడియోను చూపించినందుకు నేను మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు. ‘మనలో కొందరు నాయకులు.. అధికారంలో కూర్చున్న అసమర్థులు.. వారి అసమర్థతను కప్పిపుచ్చుకోడానికి అధికారులపై నెట్టేస్తారు.. మేము మంచివాళ్లం కానీ అధికారులు మమ్మల్ని మంచి పని చేయడానికి అనుమతించదని చెబుతారు.. నిజమే నిజాయితీగల అధికార యంత్రాంగం బలమైన, నిజమైన మంచి ఉద్దేశంతో ఉన్న నాయకుడికి మద్దతు ఇస్తుంది.. ఇది నా అనుభవంతో అంటున్నాను’ అని ఉమాభారతి తెలిపారు. ఇక, కులాల ఆధారంగా జనగణన, ప్రయివేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అంశంపై ఉమాభారతిని ఓబీసీ నేతలు కలిసి తమ డిమాండ్లను వినిపించారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని ప్రతినిధులు స్పష్టం చేశారు.


By September 21, 2021 at 01:09PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bureaucrats-around-to-pick-our-slippers-bjp-leader-uma-bharti-video-viral/articleshow/86391661.cms

No comments