టీకా తీసుకోని ఉద్యోగులకు సీఎం షాక్.. బలవంతంగా సెలవులపై పంపుతామని ప్రకటన!
కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా వెనుకంజవేయడంతో పంజాబ్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో తప్ప.. మరే ఇతర కారణంతోనైనా ఇప్పటివరకూ ఒక్క డోసు కూడా వేయించుకోని ఉద్యోగులకు బలవంతంగా సెలవులపై పంపుతామని ప్రకటించారు. టీకా తీసుకోని ఉద్యోగులందరినీ సెప్టెంబరు 15 తర్వాత సెలవుపై పంపిస్తామని సీఎం స్పష్టంచేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు అమరీందర్ సర్కారు ఓ ప్రకటనలో తెలిపింది. పంజాబ్లో కోవిడ్ పరిస్థితులపై సీఎం అమరీందర్ సింగ్ అధికారులతో శుక్రవారం వర్చువల్గా సమీక్షించారు. విశ్లేషించిన డేటా ప్రకారం టీకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్పై ప్రత్యేక కృషి జరిగిందని, అయినా ఇప్పటికీ కొందరు వ్యాక్సిన్కు దూరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అటువంటి వారిని బలవంతపు సెలవుపై పంపాలని ఆదేశించనున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు, పండుగల సీజన్ కావడంతో కరోనా వ్యాప్తి పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలను సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పంజాబ్ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కృష్ణకుమార్ మాట్లాడుతూ.. టీకా రెండు డోస్లు తీసుకున్న ఉపాధ్యాయులు, సిబ్బందినే పాఠశాలలకు అనుమతిస్తామని తెలిపారు. పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింధు మాట్లాడుతూ.. పాఠశాల సిబ్బందికి వ్యాక్సిన్ వ్యవధిని 28 రోజులకు తగ్గించడం వల్ల వారికి పూర్తిగా వ్యాక్సినేషన్ అవుతుంది.. కానీ ఈ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చిందన్నారు.
By September 11, 2021 at 07:38AM
No comments