Breaking News

నేడే తాలిబన్ల సర్కారు ఏర్పాటు.. గణతంత్ర రాజ్యంగా ఉండబోదని ప్రకటన!


అఫ్గనిస్థాన్‌ నుంచి అమెరికా పూర్తిగా వైదొలగడంతో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని తాలిబాన్లు గురువారం ప్రకటించారు. అయితే, తమ సర్కారు గణతంత్ర రాజ్యంగా ఉండబోదని.. ఇస్లాం ప్రభుత్వంగా పాలించనుందని వారు స్పష్టం చేశారు. ఇరాన్‌ మాదిరిగానే ఒక అత్యున్నత వ్యక్తి నేతృత్వంలోని ప్రధాని లేదా అధ్యక్షుడు పాలన వ్యవహారాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన నేతలు మినహా.. గిరిజనులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఉంటుందని దోహాలోని తాలిబాన్ల రాజకీయ విభాగం చీఫ్ షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానిక్జాయ్‌ ప్రకటించారు. ‘‘ప్రభుత్వ కూర్పుపై కసరత్తు పూర్తయింది.. క్యాబినెట్‌ సభ్యుల పేర్లనూ ఖరారు చేశాం. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఆ పేర్లను ప్రకటిస్తాం.. ఆ వెంటనే ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది’’ అని ఆయన వివరించారు. ముల్లా అఖుంద్‌జాదా కాందహార్‌ నుంచే ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తారని ఆయన తెలిపారు. ‘‘ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్‌ అఫ్గనిస్థాన్‌ ప్రభుత్వానికి ఇంకా పేరు ఖరారు చేయాల్సి ఉంది. జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి’’ అని ఆయన వివరించారు. దెబ్బతిన్న కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయని, 48 గంటల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇందుకు రూ. 225 కోట్ల దాకా ఖర్చవుతోందని వివరించారు. ‘‘విమానాశ్రయం అందుబాటులోకి రాగానే.. దేశం విడిచి వెళ్లాలనుకునే అఫ్గన్లకు అవకాశం కల్పిస్తాం.. అలా వెళ్లే వారికి అనుమతి పత్రాలను మంజూరుచేస్తాం’ అని ప్రకటించారు. అటు, తాలిబాన్ల సాంస్కృతిక విభాగం సభ్యుడు అనామల్లా సమాంగని కూడా కొత్త ప్రభుత్వం శుక్రవారం కొలువుదీరనున్న విషయాన్ని ధ్రువీకరించారు. మరోవైపు, అఫ్గన్‌ ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ హెరాత్‌ ప్రావిన్స్‌లో కొందరు మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 50 మంది వరకూ మహిళలు పాల్గొన్నారు. చదువుకోవడం, ఉద్యోగం, భద్రత అనేవి తమ హక్కులని నినదించారు. మేము భయపడబోమని, ఐక్యంగా ఉన్నామని స్పష్టం చేశారు. అటు అఫ్ఘాన్‌ నుంచి వలసలు పెరుగుతుండడంతో పాకిస్థాన్‌ ‘చమన్‌ బార్డర్‌’ను మూసివేసింది. భద్రతపరమైన కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పాక్‌ ప్రకటించింది. అటు, తాలిబన్లు శాంతి మంత్రం జపిస్తుండటంతో ఈ విషయంలో పశ్చిమ దేశాలు వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నాయి. అఫ్గన్‌లోని మజారీ షరీఫ్, కాందహార్‌లతో పాక్ రాజధాని ఇస్లామాబాద్‌ను అనుసంధానం చేస్తూ కొన్ని ప్రాంతాలకు మానవతాదృక్పథంతో విమానాలు పునఃప్రారంభించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. అలాగే, అఫ్గన్‌లో తమ రాయబార కార్యాలయం తెరిచే ఉంటుందని చైనా వాగ్దానం చేసిందని అధికార ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు, తమ కార్యకలాపాలు, నగదు బదిలీలను పునఃప్రారంభించనున్నట్టు వెస్ట్రన్ యూనియన్ అండ్ మనీ ట్రాన్స్‌ఫర్, కాబూల్ విమానాశ్రయంలో కార్యాలయం తెరిచినట్టు ఖతార్ ప్రకటించాయి. అలాగే, బ్రిటన్, ఇటలీ విదేశాంగ మంత్రులు అఫ్గన్‌ శరణార్ధులను తరలించడానికి పొరుగుదేశాలతో చర్చలు జరపనున్నారు.


By September 03, 2021 at 08:10AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/taliban-may-announce-new-government-in-afghanistan-today/articleshow/85886787.cms

No comments