Breaking News

అఫ్గన్‌కు విముక్తి లభించింది.. తదుపరి లక్ష్యం కశ్మీర్.. అల్‌ఖైదా సంచలన ప్రకటన


అమెరికా ఆక్రమించుకున్న ఆఫ్గనిస్థాన్‌కు తాలిబన్ల వల్ల విముక్తి లభించిందని, తదుపరి లక్ష్యం అంటూ అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఇతర ముస్లిం భూమిని విముక్తి చేయాలని ప్రపంచ ముస్లిం సమాజానికి పిలుపునిచ్చిన అల్‌ఖైదా.. కశ్మీర్‌ను ప్రపంచ జిహాద్ తదుపరి లక్ష్యం జాబితాలో చేర్చింది. కానీ ముస్లిం మైనార్టీలు అత్యంత దుర్బరణ జీవితం గడుపుతున్న చైనాలోని జిన్జియాంగ్‌, రష్యాలోని చెచన్యా ప్రాంతాలను మాత్రం ఉగ్రవాద సంస్థ ప్రస్తావించకపోవడం గమనార్హం. అమెరికాపై తాలిబాన్ ‘విజయం’ పట్ల హర్షం వ్యక్తం చేసిన ఈ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ.. పోరాటం యొక్క తదుపరి దశను ప్రారంభించాలని పిలుపునిచ్చింది. కశ్మీర్‌ సహా లెవాంట్ లేదా ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్‌లతో కూడిన మధ్య ఆసియాను ఉగ్రవాదులు షార్ట్‌లిస్ట్ చేశారు. లిబియా, మొరాకో, అల్జీరియా, మారిటానియా, ట్యునీషియా, సోమాలియాలతో కూడిన వాయువ్య ఆఫ్రికా, యెమెన్ దాని ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయి. ‘అల్లాహ్ సహాయంతో ఈ చారిత్రాత్మక విజయం ఇస్లామిక్ ప్రపంచంపై పాశ్చాత్యులు విధించిన నిరంకుశుల నిరంకుశ పాలన నుంచి విముక్తిని సాధించడానికి మార్గాన్ని చూపింది’అని పాకిస్థాన్‌లోని అల్‌ఖైదా అధికారిక మీడియ అస్-షహబ్ ఓ ప్రకటనలో తెలిపింది. అల్‌ఖైదా లక్ష్యాల జాబితాలో కశ్మీర్ ప్రధానంగా ఉంది. అల్‌ఖైదా సంస్థ జమ్మూ కశ్మీర్‌ అన్సార్ గజ్వతుల్ హింద్‌ను ప్రారంభించినప్పుడు కశ్మీర్‌ను ప్రస్తావించింది. భారత్‌లో ఇస్లాం పునఃనిర్మాణమే తమ లక్ష్యమని గతంలో పేర్కొంది. అయితే, చైనాలోని జింజియాంగ్, రష్యాలోని చెచెన్యాలో ముస్లింలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాటిని అల్‌ఖైదా మినహాయించడం వెనుక దాని రాజకీయ ప్రయోజనం బయటపడింది. తాలిబన్లకు మద్దతుగా చైనా, రష్యా ఇటీవల ముందుకొచ్చాయి. సంస్థ పాకిస్థాన్‌లో అయమన్ అల్-జవహిరిని తమ అధిపతిగా ప్రకటించింది. దీంతో తమకు ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్‌ ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ప్రకటన అనేది స్పష్టమవుతోంది. ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న రెండు ప్రాంతాల గురించి అల్-ఖైదా ప్రస్తావించకపోవడం గమనార్హం. చెచెన్యాలో రష్యా దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ఇరాక్, సిరియాలో పెద్ద సంఖ్యలో ఐఎస్ ఫైటర్లను ఏర్పాటు చేశారు. జిన్జియాంగ్‌లోని ముస్లింలు అణచివేతకు గురవుతున్నట్టు పలు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. ఐరాస భద్రతా మండలిలో మంగళవారం నాటి 2693 తీర్మానం విషయంలో చైనా, రష్యాలు కలిసి పని చేశాయి. ఈ తీర్మానంలో ఉఘర్‌లు, తూర్పు తుర్కేస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం (ఈటీఐఎం) చేర్చకపోవడంపై రెండు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అఫ్గన్లను తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రష్యా.. దీనిని మేథావుల వలసగా అభివర్ణించింది. అయితే తన మిషన్‌ను పూర్తి చేయడానికి అమెరికా కొనసాగాలని చైనా కోరుకుంది.


By September 02, 2021 at 08:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/al-qaida-cheers-afghanistan-victory-says-kashmir-next-target/articleshow/85855106.cms

No comments