Breaking News

Ashi Trading టాల్కమ్ పౌడర్ రూపంలో ఆంధ్రప్రదేశ్‌కు.. రూ.9వేల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్!


దేశంలో భారీ ఎత్తున జరుగుతున్న డ్రగ్స్ దందాలు బయటపడుతున్నాయి. దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న మత్తుపదార్థాలపై దృష్టిసారించిన అధికారులు.. ఎక్కడికక్కడ దాడులు నిర్వహించి, ముఠాల ఆటకట్టిస్తున్నారు. తాజాగా, గుజరాత్‌లో రూ.9,000 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంద్రా పోర్టులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రూ.9,000 కోట్ల విలువైన హెరాయిన్‌ ఉన్న 2 కంటెయినర్లను సెప్టెంబరు 15న జప్తుచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అఫ్గనిస్థాన్‌ రాజధాని కాందహార్‌ కేంద్రంగా పనిచేసే హసన్‌ హుస్సేన్‌ లిమిటెడ్‌ సంస్థ నుంచి టాల్కమ్‌ పౌడర్‌ రూపంలో వచ్చిన ఈ సరకు విజయవాడ కేంద్రంగా పనిచేసే ఆషీ ట్రేడింగ్‌ సంస్థకు వెళుతున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు.. సంస్థ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. వ్యాపార లావాదేవీలు, ఇప్పటివరకు ఎన్ని కన్‌సైన్‌మెంట్లు వచ్చాయి? ఏయే దేశాల నుంచి వచ్చాయి? తదితర వివరాలను కూపీ లాగుతున్నారు. అషీ ట్రేడింగ్ మూలాలు కాకినాడ నుంచి విజయవాడ, చెన్నై వరకూ విస్తరించినట్లు తేలింది. కేవలం కాగితాల్లో మాత్రమే ఈ కంపెనీని నడిపిస్తున్నట్లు వెల్లడైంది. విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వారి వీధి చిరునామాతో ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ గతేడాది ఆగస్టు 18న రిజిస్టర్‌ అయింది. దుర్గా పూర్ణ వైశాలి గోవిందరాజు అనే వ్యక్తి పేరుతో దీనిని ప్రారంభించి.. బియ్యం, పండ్లు, కూరగాయల టోకు వ్యాపారం కోసం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చిన ఫోన్‌ నెంబరు ఎం సుధాకర్‌ అనే వ్యక్తి పేరుతో ఉండగా.. ప్రస్తుతం అది స్విచ్ఛాఫ్‌ వస్తోంది. అదే నంబర్‌తో ఉన్న వాట్సప్‌ ప్రొఫైల్‌ పరిశీలించగా.. చెన్నై కేంద్రంగా ‘ఆషీ సోలార్‌ సిస్టమ్‌’ అనే మరో కంపెనీని కూడా సుధాకర్‌ నెలకొల్పినట్లు వెల్లడయ్యింది. దానికి సంబంధించిన బ్రోచర్‌ను తన ఫోన్‌ నంబర్‌, పేరుతో సహా ఆయన వాట్సప్‌ ప్రొఫైల్‌ చిత్రంగా పెట్టుకున్నారు. కాకినాడకు చెందిన సుధాకర్‌ ఎనిమిదేళ్లుగా చెన్నై శివారు పోరూరులోని కోలపాకంలో ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో సహా ఉంటున్నాడు. ఈ క్రమంలో పక్కింట్లో నివాసం ఉండే ఇంజినీరింగ్‌ చదివిన యువకుడిని సంప్రదించాడు. సోలారా విద్యుత్ పరికరాలకు సంబంధించిన వ్యాపారం చేయాలకుంటున్నానని, తనకు ఎలాంటి పరిజ్ఞానమూ లేనందున సహకరించాలని కోరాడు. అనంతరం ఆ యువకుడి ఫోన్‌ నంబర్‌ను కంపెనీ కాంటాక్ట్స్‌లో పొందుపరిచాడు. కానీ ఆ కంపెనీ ద్వారా ఎలాంటి వ్యాపారమూ చేయలేదు. ముంద్రా ఓడరేవులో గత బుధవారం డీఆర్‌ఐ అధికారులు హెరాయిన్‌తో కూడిన కంటైనర్లను పట్టుకున్నారు. అవి విజయవాడలోని ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. అయితే, అదే రోజు రాత్రి నుంచి సుధాకర్‌ ఇంటికి తాళం వేసి ఉంది. నాలుగు రోజుల కిందట డీఆర్‌ఐ అధికారులు జీఎస్టీ సిబ్బందిని సంప్రదించి.. విజయవాడలోని ఆషీ ట్రేడింగ్‌ కంపెనీకి సంబంధించిన పూర్వాపరాలను ఆరా తీశారు.


By September 20, 2021 at 10:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/heroin-worth-rs-9000-crore-seized-from-gujarat-mundra-port-links-with-kakinada-man/articleshow/86360036.cms

No comments