Afghanistan జలాలాబాద్లో ఐఎస్ వరుస పేలుళ్లు.. 25 మంది తాలిబన్లు మృతి?
అఫ్గనిస్థాన్లో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. తూర్పు అఫ్గనిస్థాన్లోని జలాలాబాద్లో తాలిబన్లే లక్ష్యంగా ఐఎస్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో సహా 25 మందికిపైగా చనిపోయినట్టు తెలుస్తోంది. జలాలాబాద్ నగరంలో తాలిబన్లకు చెందిన ఓ వాహనమే లక్ష్యంగా ఆదివారం ఓ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. జలాలాబాద్లో వరుస పేలుళ్లకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని నంగరహర్ ప్రావిన్సుల్లో ఐఎస్ ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువ. ఈ ప్రావిన్సుల రాజధాని వరుస పేలుళ్లకు తామే పాల్పడినట్టు ఐఎస్ అధికారిక టెలిగ్రామ్ మీడియా అమఖా న్యూస్ పేర్కొంది. శనివారం మూడు చోట్ల తాలిబన్ల వాహనాలే లక్ష్యంగా బాంబు దాడులు చేశామని, ఆదివారం కూడా మరో దాడి చేసినట్టు తెలిపింది. ఈ ఘటనలో 35 మందికిపైగా తాలిబన్లు చనిపోవడం లేదా గాయపడ్డారని తెలిపింది. ఐఎస్ ఉగ్రవాదుల దాడిలో గాయపడిన తాలిబన్ ఫైటర్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు స్థానిక మీడియా తెలిపింది. కాబూల్ నుంచి వచ్చే వాహనాలు నిలిపి ఉంచే ప్రదేశంలోనే బాంబు దాడి జరిగినట్టు ఓ జర్నలిస్ట్ తెలిపారు. శనివారం జరిగిన వరుస బాంబు పేలుళ్లలో కనీసం ఇద్దరు పౌరులు చనిపోయారని వెల్లడించారు. ఆగస్టు 31న అమెరికా సైన్యం అఫ్గనిస్థాన్ను వీడిన తర్వాత జరిగిన తొలి బాంబు పేలుళ్లు ఇవే కావడం గమనార్హం. ఇక, ఈ పేలుళ్లపై తాలిబన్లు ఇంత వరకూ స్పందించలేదు. ఆగస్టులో అఫ్గన్ను ఆక్రమించుకున్న తాలిబన్లను ఐఎస్ ఉగ్రవాదులు ఇక్కడ నుంచే టార్గెట్ చేస్తున్నారు. నంగరహర్, కునార్ ప్రావిన్సుల్లోని కొన్ని జిల్లాలు ఐఎస్ ఉగ్రమూకలు అధీనంలో ఉన్నాయి. ఐఎస్, తాలిబన్లు సున్నీ వర్గానికి చెందినవారే అయినా.. వీరి సిద్ధాంతాలు మాత్రం వేర్వేరు.
By September 21, 2021 at 10:41AM
No comments