Breaking News

Petrol Price నెహ్రూ తొలి ప్రసంగం వల్లే పెట్రోల్ ధరలు పెరుగుదల.. బీజేపీ మంత్రి వింత వ్యాఖ్యలు


దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో బండి తీయాలంటే సామాన్యులు భయపడుతున్నారు. దేశంలో రోజువారీ సమీక్ష విధానం అమల్లోకి వచ్చిన తర్వాత చమురు ధరలు తగ్గిన పాపాన పోలేదు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.110 పలుకుతోంది. ధరలు ఇంతగా పెరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రో, డీజిల్ ధరల విషయంలో కేంద్రంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మంత్రి వింత వ్యాఖ్యలు చేశారు. చమురు ధరలు పెరగడానికి, ద్రవ్యోల్బణానికి భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ఎర్రకోట నుంచి 1947 ఆగస్టు 15న చేసిన ప్రసంగమే కారణమని మధ్యప్రదేశ్ మంత్రి ఆరోపించారు. ఆయన రెండు రోజుల కిందట మీడియాతో మాట్లాడుతూ.. తొలి ప్రధాని, ఆయన పార్టీ దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టుంటే ద్రవ్యోల్బణం అదుపులో ఉండేదని వ్యాఖ్యానించారు. ఒకటి రెండు రోజుల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోదని వ్యాఖ్యానించారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను కుంగదీసి ద్రవ్యోల్బణం పెంచిన ఘనత ఎవరికైనా దక్కితే, అది నెహ్రూ కుటుంబమే’అని దుయ్యబట్టారు. ‘ద్రవ్యోల్బణం ఒకటి రెండు రోజుల్లో పెరగదు.. ఆర్థిక వ్యవస్థకు పునాది ఒకటి లేదా రెండు రోజుల్లో వేయలేం... 1947 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం తప్పుల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించింది’ అని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. గత ఏడేళ్లుగా దేశ ఆర్ధిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ పాలన వల్లే ద్రవ్యోల్బణం దిగొచ్చి, ప్రజల ఆదాయం పెరుగుతోందని అన్నారు. ‘‘దేశాభివృద్ధి ఘనత అంతా నెహ్రూదేనని కాంగ్రెస్ నేతలు అంటుంటారు. మరి గ్రామాలు, వ్యవసాయం ఎందుకు వెనకబడి ఉందో చెప్పాలి. గాంధీ కుటుంబ పాలనలో ఆర్థిక విధానం గ్రామాలు, వ్యవసాయాన్ని ఎందుకు బాగు పర్చలేదు’ అన్నారు. ‘ నెహ్రూ విదేశాల్లో చదువుకున్నారు. ఆ సంస్కృతికి ప్రభావం చెందిన ఆయన మన సంస్కృతిని పక్కనపెట్టారు. దేశంలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది. ఇది కాంగ్రెస్ పాలన కారణంగా వచ్చింది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు మా చేతిలో ఉండవు. ప్రపంచ మార్కెట్ విధానాలకు అనుగుణంగా ఉంటాయి. మేం వాటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో అనేకసార్లు ధరలను తగ్గించాం’’ అని విశ్వాస్ సారంగ్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా గాంధీ నివాసం 10 జన్‌పథ్ ఎదుట ధర్నా చేయాలని ఎద్దేవా చేశారు. దేశంలోని 70 శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, నెహ్రూ దానిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. పారిశ్రామికీకరణ బాగుంది.. కానీ, అది వ్యవసాయంపై ఆధారపడి ఉండాలి అని పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు, ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ధరలను నియంత్రించడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం.. తప్పులను ఎదుటివాళ్లపై నెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడుతున్నారు.


By August 02, 2021 at 08:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/petro-disel-rates-and-inflation-hike-due-to-speech-by-jawaharlal-nehru-mp-minister-vishwas-sarang/articleshow/84962909.cms

No comments