Breaking News

‘పంజరంలోని చిలుకలా ఉన్న సీబీఐని విడుదల చేయండి’.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు


కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్వయంప్రతిపత్తి సంస్థ అని, కేవలం పార్లమెంట్‌కు మాత్రమే నివేదిస్తుందని మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై రాజకీయ కక్షసాధింపులకు వినియోగించుకోవడంతో స్వయంప్రతిపత్తి, స్వాతంత్రకోసం పోరాటం చేస్తోందని విమర్శలు వస్తున్న వేళ.. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ‘పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీగా ఉండే భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐకి స్వయంప్రతిపత్తి ఉండాలి’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుత వ్యవస్థను సరిదిద్దడానికి తాము చేసిన 12 పాయింట్ల సూచనలలో ‘పంజరంలోని చిలుకలా ఉన్న సీబీఐని’విడుదల చేసే ప్రయత్నం అని కోర్టు పేర్కొంది. బొగ్గు గనుల కేటాయింపు కేసుల విచారణ సందర్భంగా సీబీఐను ‘పంజరంలో చిలుక’ అంటూ సుప్రీంకోర్టు 2013లో అభివర్ణించింది. అప్పడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ.. కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం సీబీఐని నియంత్రిస్తోందని ఆరోపించింది. అయితే, గత కొన్నేళ్లుగా సీబీఐ పలువురు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగడంతో.. ఆ సంస్థ బీజేపీ డిమాండ్లను తీర్చినట్లు ఆరోపణలు ఎదుర్కుంటోంది. ముఖ్యంగా బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ‘ప్రధాన మంత్రి నియంత్రించే కుట్ర బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’అని ఆరోపించారు. చట్టబద్ధమైన హోదా ఇచ్చినప్పుడు మాత్రమే సంస్థ స్వయంప్రతిపత్తిని నిర్ధారించగలమని గమనించిన న్యాయస్థానం.. ‘చట్టబద్ధమైన హోదాను పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి మరింత అధికారం కల్పించాలి.. దీని వల్ల సీబీఐపై ప్రభుత్వ పరిపాలనా నియంత్రణ లేకుండా క్రియాత్మక స్వయంప్రతిపత్తి కలుగుతుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక, 1941లో ఏర్పడిన సీబీఐ.. ప్రధాన మంత్రి కార్యాలయం అధీనంలో ఉండే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్‌ (డీఓపీటీ)‌కు బాధ్యత వహిస్తోంది. దీని డైరెక్టర్‌ను ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం ఎంపిక చేస్తుంది. తమిళనాడులోని పోంజి కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. జస్టిస్ ఎన్ కిరుబకరన్, జస్టిస్ బీ పుగళేందిల ధర్మాసనం ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. ‘ఎలక్షన్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐ మరింత స్వయంప్రతిపత్తిగా ఉండాలి.. సీబీఐ డైరెక్టర్‌కు ప్రభుత్వ కార్యదర్శిగా అధికారాలు ఇవ్వబడతాయి.. DoPT ద్వారా కాకుండా నేరుగా మంత్రి/ ప్రధాన మంత్రికి నివేదించాలి’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, సంస్థలో మానవవనరుల కొరతతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించలేమని కేంద్రం పేర్కొంది. దీంతో ఈ అంశంపై నెల రోజుల్లోగా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది.


By August 18, 2021 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/madras-high-court-an-order-to-centre-on-release-caged-parrot-cbi/articleshow/85418711.cms

No comments