Breaking News

మేం శత్రువులమో.. మిత్రులమో.. భారత్ నిర్ణయించుకోవాలి.. తాలిబన్లు సంచలన ప్రకటన


గత నెలలో తాలిబన్లు, అఫ్గనిస్థాన్ సైన్యం మధ్య జరిగిన పోరులో భారతీయ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రాయిటర్స్‌ వార్తా సంస్థలో చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డానిష్ సిద్దీఖి.. అఫ్గన్ సైన్యం, తాలిబన్ల మధ్య సాగుతున్న పోరాటాన్ని కవర్ చేస్తున్నారు. అందులో భాగంగానే జులై 15న కాందహార్‌లోని స్పిన్‌ బోల్డక్‌కు అఫ్గాన్‌ దళాలతో కలిసి వెళ్లారు. అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో సిద్ధిఖీ చనిపోయారు. తాజాగా, దీనిపై స్పందిస్తూ.. ఆయన తప్పిదం వల్లే ఇలా జరిగిందన్నారు. ఖతార్‌లోని తాలిబన్ రాజకీయ కార్యాలయం అధికార ప్రతినిధి మొహమూద్ సోహెయిల్ షహీన్ ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ ఎదురుకాల్పుల్లో మరణించాడు.. తాలిబన్లతో సమన్వయం చేయకపోవడమే ఆయన చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు. ‘అతడిని మా యోధులు చంపారనడం సరికాదు.. ఆయన మాతో ఎందుకు సమన్వయం చేసుకోలేదు.. మా ప్రాంతానికి వచ్చినప్పుడు మాతో సమన్వయం చేసుకుంటే మేము మీకు భద్రత కల్పిస్తామని జర్నలిస్టులకు చాలాసార్లు చెప్పాం’ అన్నారు. ‘అంతేకాదు ఆయన అఫ్గన్ సైనిక దళాలతో కలిసి ఉన్నాడు.. అలాంటప్పుడు వారు సైనికులా, మిలీషియా లేదా జర్నలిస్ట్ అనే తేడాను చూడం.. ఎదురుకాల్పుల్లో చనిపోయాడు కాబట్టి ఎవరి వల్ల చనిపోయాడో తెలియదు’ అని వ్యాఖ్యానించారు. సిద్ధిఖీని బందీగా పట్టుకుని ఉరితీశారని, ఆయన మృతదేహాన్ని ముక్కలుగా చేశారని వచ్చిన నివేదికలను తాలిబన్ల అధికార ప్రతినిధి తోసిపుచ్చారు. ‘ఈ విషయంలో ఇప్పటికే రెండు మూడు సార్లు ఖండించాం... చిత్రహింసలకు గురిచేసి చంపి మృతదేహాన్ని ముక్కలు చేయడం మా విధానం కాదు.. మమ్మల్ని క్రూరంగా చిత్రీకరించడానికి సైన్యమే ఇలా చేసుంటుంది.. మృతదేహాలను ముక్కలుగా చేయడం ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకం’ అని స్పష్టం చేశారు. అంతేకాదు తాలిబన్లను జర్నలిస్టులు సంప్రదించగలరా? క్షేత్రస్థాయి రిపోర్టింగ్‌కు అనుమతిస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు మా ప్రాంతాలకు వచ్చి రిపోర్టింగ్ చేయాలనుకుంటే రావచ్చు ... మా ప్రాంతాలలోని క్షేత్రస్థాయి వాస్తవాలను వారు తమ కళ్లతో చూడవచ్చు’ అని షహీన్ పేర్కొన్నారు. భారత్‌ను శత్రువుగా పరిగణిస్తారా? లేదా మిత్రుడిగా భావిస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘తాలిబన్లు మిత్రులా? శత్రువులా అనే విషయాన్ని భారత ప్రభుత్వాన్ని అడగండి నన్ను కాదు... ఒకవేళ మాకు వ్యతిరేకంగా అఫ్గనిస్థాన్ ప్రజలకు తుపాకులు, ఆయుధాలను అందజేసి హింసను ప్రేరేపిస్తే శత్రువుగా భావిస్తాం.. మా దేశంలో శాంతి, శ్రేయస్సు కోసం భారత్ పనిచేస్తే దానిని శత్రుత్వంగా పరిగణించం.. దీనిని భారత్ నిర్ణయించుకోవాలి’అని అన్నారు.


By August 14, 2021 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/we-are-a-friend-or-an-enemythat-is-for-india-to-decide-says-taliban/articleshow/85319448.cms

No comments