Breaking News

వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు.. నిన్న ఒక్క రోజే కోటికిపైగా డోస్‌లు పంపిణీ


వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయిని సాధించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా కోటి మందికి టీకా వేశారు. ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ వేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క రోజే కోటికిపైగా డోసులను పంపిణీ చేసి రికార్డు నెలకొల్పడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు దేశ వ్యాప్తంగా 1,02,06,475 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ జరిగినట్టు కొవిన్‌ పోర్టల్‌లో నమోదైంది. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్పందిస్తూ.. ‘ఆరోగ్య సిబ్బంది కష్టం, ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్ప ఫలితమే ఇది’ అని ట్వీట్ చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 62 కోట్ల పైగా డోస్‌లను వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 4.05 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది రెండో డోస్‌లు తీసుకున్నట్టు కొవిన్ పోర్టల్‌లో నమోదయ్యింది. శుక్రవారం అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 28.62 లక్షల మందికి టీకాలు వేయగా.. తర్వాత కర్ణాటకలో 10.79 లక్షల మంది టీకా వేయించుకున్నారు. దేశంలోని 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఫ్రీ వ్యాక్సినేషన్ జూన్‌లో ప్రకటించిన తర్వాత టీకా పంపిణీ వేగవంతమయ్యింది. ఉచిత వ్యాక్సినేషన్‌లో భాగంగా తయారీ సంస్థల నుంచి ఉత్పత్తి అయిన 75 శాతం టీకాలను కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందజేస్తోంది. మిగతా 25 శాతం టీకాలు ప్రయివేట్ ఆస్పత్రులకు కేటాయించారు. కొవిన్ పోర్టల్ ద్వారా టీకా రిజిస్ట్రేషన్ చేసుకుని, సంబంధిత కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.


By August 28, 2021 at 06:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-achieved-a-new-milestone-in-covid-vaccinationadministering-over-1-crore-doses-friday/articleshow/85705488.cms

No comments