Breaking News

జస్టిస్ బీవీ నాగరత్న.. 2027లో మొట్టమొదటి మహిళా సీజేగా!


అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకాల కోసం తొమ్మిది మంది పేర్లతో కూడిన జాబితాను కొలీజియం మంగళవారం ఆమోదం తెలిపింది. వీరిలో కర్ణాటక హైకోర్టుకు చెందిన మహిళా న్యాయమూర్తి పేరు కూడా ఉంది. ఒకవేళ ఆమె నియామకం ఖరాయితే.. 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి అయిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మరో ఇద్దరు మహిళ న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు బార్ నుంచి ఒకరి ప్రత్యక్ష నియామకానికి కొలీజియం ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం ఆమోదించిన జాబితాలో జస్టిస్ నాగరత్న సహా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది పేర్లు ఉన్నాయి. సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ‌ను నేరుగా నియమించాలని సిఫార్సు చేసింది. ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారిమన్ భారతదేశ న్యాయ చరిత్రలో బార్ నుంచి నేరుగా నియమించిన ఐదో న్యాయవాది. ఆయన తర్వాత నేరుగా నియమితులు కానున్న వ్యక్తి పీఎస్ నరసింహ. ఇదిలా ఉండగా, కర్ణాటక, గుజరాత్, సిక్కమ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇద్దరు కేరళ హైకోర్టు న్యాయమూర్తులు కొలీజియం అమోదించిన జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. తొమ్మిది మందిలో జస్టిస్ నాగరత్న సహా ముగ్గురికి భారత ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టే అవకాశం ఉంది. కొలీజియంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో నియామకాల కోసం ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వానికి పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చిన గత 21 నెలల్లో ఇది మొదటి కొలీజియం. చివరిసారిగా 2019 నవంబరులోనే కేంద్రానికి న్యాయమూర్తుల నియామకంపై కొలీజియం సిఫార్సు చేసింది. ఆ తర్వాత ఒక్క పేరును కూడా సిఫార్సు చేయలేదు. ఆగస్టు 14న జస్టిస్ నారిమన్ పదవీ విరమణతో సుప్రీంకోర్టులో మొత్తం 9 ఖాళీలేర్పడగా.. ఆగస్టు 18న జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణ చేస్తారు. దీంతో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు గానూ 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా, తొమ్మిది మంది న్యాయమూర్తుల నియమకానికి కొలీజియం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒక్క మహిళా న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ పదవీకాలం వచ్చే ఏడాది సెప్టెంబరులో ముగియనుంది. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకూ కేవలం మంది మహిళా న్యాయమూర్తులు మాత్రమే బాధ్యతలు నిర్వహించారు.


By August 18, 2021 at 09:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-justice-bv-nagarathna-to-be-first-woman-chief-justice-of-india-in-2027/articleshow/85419339.cms

No comments