Breaking News

పెగాసస్‌పై దుమారం.. పలు దేశాల్లో వినియోగం ఎన్‌ఎస్ఓ సంచలన నిర్ణయం


పెగాసస్‌ స్పైవేర్‌ దుర్వినియోగమవుతోందంటూ వచ్చిన ఆరోపణలపై ఇజ్రాయెల్‌ దర్యాప్తు ప్రారంభించింది. ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ కార్యాలయాల్లో ఇజ్రాయేల్ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. రక్షణ శాఖకు చెందిన ‘ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ డివిజన్‌ (ఈసీడీ)’ మంజూరు చేసిన అనుమతులు, అధికారాలకు అనుగుణంగా ఎన్‌ఎస్‌వో నడుచుకుంటుందా? లేదా? అనేది ప్రధానంగా పరిశీలించనున్నారు. తనిఖీల్లో ఈసీడీ ప్రతినిధులతో పాటు జాతీయ భద్రత మండలి (ఎన్‌ఎస్‌సీ) అధికారులు కూడా పాల్గొన్నట్టు ఇజ్రాయేల్ మీడియా తెలిపింది. ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిన విషయాన్ని ఎన్‌ఎస్‌వో గ్రూపు కూడా ధ్రువీకరించింది. పెగాసస్‌‌పై ఆరోపణలు భారత్‌లో కలకలం సృష్టిస్తున్నవేళ ఫ్రాన్స్‌ సైబర్‌ భద్రత సంస్థ ఏఎన్‌ఎస్‌ఎస్‌ఐ కీలక ప్రకటన చేసింది. ఆ స్పైవేర్‌తో హ్యాకింగ్‌ జరిగిన మాట వాస్తవమేనని పేర్కొంది. తమ దేశానికి చెందిన ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లలో ఆ ఆనవాళ్లు కనిపించాయని తెలిపింది. ఇదిలా ఉండగా, తమ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు అమెరికాకు చెందిన లాభాపేక్షలేని మీడియా సంస్థ ఎన్పీఆర్ పేర్కొంది. ఎన్పీఆర్ ప్రకారం.. పెగాసస్ ప్రాజెక్టుపై ఆరోపణలు రావడంతో గ్రూప్ సాఫ్ట్‌వేర్ సరఫరాను నిలిపివేసింది. పెగాసస్ స్పైవేర్ సాయంతో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతల ఫోన్‌లను హ్యక్ చేసినట్టు నివేదికలు వెలువడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ‘కొంత మంది క్లయింట్స్‌పై దర్యాప్తు ప్రారంభించింది.. ఇంకొందరికి తాత్కాలికంగా నిలిపివేసింది’ అని ఎన్ఎస్ఓ వర్గాలు చెప్పినట్టు ఎన్పీఆర్ వివరించింది. ఈ అంశంపై పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ అధికారి మాట్లాడుతూ.. కంపెనీ పాలసీ ప్రకారం ఈ విషయంపై మీడియా విచారణలకు ఇకపై స్పందించదని, ఇలా చేయడం దుర్మార్గపు చర్యని వ్యాఖ్యానించారు. ఇటీవల తన స్పైవేర్‌ను వినియోగించకుండా తాత్కాలికంగా నిషేధించిన ప్రభుత్వ ఏజెన్సీలు లేదా దేశాల జాబితాను వెల్లడించలేదని ఎన్పీఆర్ పేర్కొంది. ఇజ్రాయేల్ రక్షణ నిబంధనలు తమ ఖాతాదారులను గుర్తించకుండా నిషేధించాయని నొక్కి చెప్పింది. మొత్తం 40 దేశాల్లో 60 మంది క్లయింట్స్ ఉన్నారని వీరంతా నిఘా వర్గాలు, సైన్యం, భద్రత సంస్థలేనని ఎన్ఎస్ఓ పేర్కొంది. దుర్వినియోగంపై మీడియాలో కథనాలు రాకముందే గత రెండేళ్లలో ఐదు ప్రభుత్వ సంస్థలు తమ సాఫ్ట్‌‌వేర్‌ను వాడకుండా నిషేధించినట్టు తెలిపింది.


By July 31, 2021 at 07:17AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/nso-has-blocked-pegasus-use-by-some-governments-says-npr-reports/articleshow/84912224.cms

No comments