Breaking News

ఒకే ఏడాది రెండు బోర్డ్ పరీక్షలు.. సరికొత్త విధానానికి సీబీఎస్‌ఈ శ్రీకారం


కరోనా మహమ్మారి విజృంభణతో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్‌ఈ సరికొత్త విధానాన్ని ప్రకటించింది. పది, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలను రెండు దశల్లో నిర్వహించనుంది. తొలి దశలో ఆబ్జెక్టివ్, రెండో దశ డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను వెల్లడించింది. ఈ విధానం వల్ల సిలబస్‌‌ భారం ఎక్కువ ఉండదని, రెండు పరీక్షల్లో విద్యార్థులు సాధించి స్కోర్ల ఆధారంగా తుది మార్కులను కేటాయించనున్నారు. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పరీక్షలకు సమానమైన వెయిటేజీ ఇవ్వనున్నట్టు తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నవంబరు-డిసెంబరు మధ్య ఆబ్జెక్టివ్, వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ‘కరోనా తగ్గుముఖం పట్టి పరిస్థితులు చక్కబడితే పూర్తిస్థాయి సిలబస్‌తో ఫస్ట్ టెర్మ్ పరీక్షలు అక్టోబరు-నవంబరు, సెకెండ్ టర్మ్ ఫిబ్రవరి-మార్చిలో నిర్వహిస్తాం’ అని పేర్కొంది. సీబీఎస్‌ఈ మార్గదర్శకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, విదేశాలలో ఉన్న పాఠశాలలకు 4-8 వారాల వ్యవధితో సౌకర్యవంతమైన షెడ్యూల్‌లో ఫస్ట్ టర్మ్ పరీక్షలను నిర్వహిస్తుంది. 90 నిమిషాల కాల వ్యవధితో కూడిన ప్రశ్నాపత్రంలో బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి.. మహమ్మారి సమయంలో ఇది హేతుబద్ధమైన సిలబస్‌ను మాత్రమే కవర్ చేస్తుంది. రెండో దశలో సెకెండ్ టర్మ్ పరీక్షలు నిర్వహిస్తుంది. రెండు గంటల వ్యవధి, వివిధ ఫార్మాట్లలో ప్రశ్నలు ఉంటాయి. అయితే, డిస్క్రిప్టివ్ పరీక్షకు పరిస్థితి అనుకూలంగా లేకపోతే ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహించనున్నామని ఓ అధికారి తెలిపారు.ఆబ్జెక్టివ్ తరహాలో ఓఎంఆర్ షీట్లు స్కాన్ చేసి నేరుగా పోర్టల్‌ లేదా ప్రత్యామ్నాయంగా అదే రోజు వారి పాఠశాలల్లో అప్‌లోడ్ చేస్తారు. ‘విద్యార్థులు నిర్దిష్ట టర్మ్ పరీక్షకు ఉద్దేశించిన సిలబస్‌ను మాత్రమే బోధిస్తారు. ఫస్ట్ టెర్మ్ సిలబస్‌ రెండో టర్మ్‌లో పరీక్షలో ఉండదు.. దీనికి భిన్నంగా ఉంటుంది’ అని సీబీఎస్‌ఈ అధికారి ఒకరు తెలిపారు. కోవిడ్ -19 అనుభవం నుంచి పాఠాలను నేర్చుకున్న సీబీఎస్‌ఈ ఆన్‌లైన్ పరీక్షలను అత్యవసర చర్యగా ఎంకి చేసుకుంటోంది ‘మహమ్మారి కారణంగా పరీక్షలు వాయిదా, రద్దు చేయడం జరుగుతోంది.. కాబట్టి ఆన్‌లైన్ పరీక్ష ఒక మోడల్ ఇది కూడా ప్రణాళికలో భాగమే’ అని ఆయన అన్నారు.


By July 06, 2021 at 07:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cbse-will-conduct-class-10-and-12-board-exams-in-two-parts-from-the-current-academic-year/articleshow/84161072.cms

No comments