Breaking News

త్వరలో సుప్రీంకోర్టు కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం..సీజేఐ రమణ ప్రకటన


సుప్రీంకోర్టు కార్యకలాపాలను త్వరలోనే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ఆ దిశగా ప్రక్రియ మొదలయ్యిందని శనివారం అన్నారు. కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాన్ని జస్టిస్ ఎన్వీ రమణ శనివారం విర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు కోర్టుల్లో కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆలోచిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కోర్టు కార్యకలాపాలకు చెందిన వివరాలను ప్రజలు మీడియా ద్వారా తెలుసుకుంటున్నారని అన్నారు. ‘కోర్టుల నుంచి వచ్చిన సమాచారం మీడియాలో ఫిల్టర్ చేయబడుతోంది.. ఈ ప్రక్రియలో అడిగిన ప్రశ్నలను తప్పుగా అర్ధం చేసుకోవడంతో ధర్మాసనం పరిశీలనలకు కొన్నిసార్లు నష్టం జరుగుతుంది. న్యాయస్థానాలను ఇబ్బంది పెట్టడానికి లేదా కించపరచడానికి ఈ తప్పుడు అంశాలను ప్రచారం చేయడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారు’ అన్నారు. ‘ప్రత్యక్ష ప్రసారం లేకపోవడం దురాభిప్రాయాలకు అవకాశం ఏర్పడుతోంది... కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడమే దీనికి ఉత్తమ నివారణ. సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రత్యక్ష ప్రసారం చాలా ముఖ్యమైంది.. దీని ద్వారా మొత్తం విచారణ, న్యాయమూర్తుల అభిప్రాయాల గురించి ప్రజలు కచ్చితమైన సమాచారం పొందవచ్చు.. గొడవలు జరగడానికి తక్కువ అవకాశం ఉంటుంది’ అని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ‘సరైన దిశలో అడుగు వేస్తున్నా ఆ మార్గంలో జాగ్రత్తగా నడవాలి.. కొన్ని సమయాల్లో ప్రత్యక్ష ప్రసారాలు రెండువైపులా దారున్న కత్తిలా మారే అవకాశం ఉంది.. న్యాయమూర్తులు చివరికి ఒత్తిడితో కూడిన వాతావరణానికి దారితీయవచ్చు.. న్యాయ పంపిణీకి అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా న్యాయం చేయమని ఆదేశించినప్పటికీ రాజ్యాంగం ప్రకారం తాను చేసిన ప్రమాణం పట్ల న్యాయమూర్తి నిబద్ధతకు కట్టుబడి ఉండాలి’అని జస్టిస్ రమణ అన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన విభిన్న కారణాలవల్ల సమాజంలో సంఘర్షణలు అనివార్యమయ్యాయని, వాటి పరిష్కారానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. పరస్పర ఆమోదం, సహకారంతో వివాదాలను పరిష్కరించుకొనే సుదీర్ఘ సంస్కృతి భారత్‌తోపాటు, ఎన్నో ఆసియా దేశాలకు ఉందని అంతకు ముందు మరో సదస్సులో వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల్లో కార్యకలాపాలు, విచారణలపై ప్రత్యక్ష ప్రసారం అంశంపై చాలా కాలం నుంచి చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం చేసే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కోర్టు వ్యవహారాల్లో దాపరికం లేకుండా ప్రత్యక్ష ప్రసారం విధానాన్ని అమలు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది.


By July 18, 2021 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/chief-justice-nv-ramana-says-supreme-court-proceedings-to-go-live-soon/articleshow/84516089.cms

No comments