Breaking News

రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 18 మంది మృతి


ఉత్తర్ ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 19 మంది గాయపడ్డారు. లక్నో-అయోధ్య జాతీయ రహదారిపై ఆగి ఉన్న డబుల్ డెక్కర్ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. బారాబంకి జిల్లా రామ్ స్నేహిఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతుల కోసం డ్రైవర్ బస్సును నిలిపి ఉంచగా.. లక్నో నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలోనే చాలా మంది మృతిచెందినట్టు లక్నో జోన్ ఏడీజీ సత్యనారాయణ సాబత్ పేర్కొన్నారు. బస్సు హరియాణా నుంచి బిహార్‌కు వెళ్తున్నట్టు గుర్తించారు. ‘బస్సు మరమ్మతు చేయాల్సి ఉందని, కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ప్రయాణికులకు డ్రైవర్ చెప్పాడు.. వాహనం నిలిపి ఉంచిన కొద్ది సేపటికే వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది.. దీంతో చాలా మంది తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు’ అని ఏడీజీ అన్నారు. ప్రమాద సమయంలో బస్సు కింద ప్రయాణికులు కొందరు నిద్రపోతున్నట్టు తెలిపారు. ప్రమాదం తీవ్రతకు బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో అందులో చిక్కుకున్న మృతదేహాలను అతికష్టంతో బయటకు తీస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. బస్సులో ఉన్నవారిని వలస కూలీలుగానే భావిస్తున్నారు. పనులు కోసం బిహార్‌కు వెళ్తున్నట్టు తెలుస్తోంది.


By July 28, 2021 at 07:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/18-killed-in-road-accident-due-speeding-truck-hits-bus-in-uttar-pradesh/articleshow/84812853.cms

No comments