Breaking News

రెండు దశాబ్దాలు.. 148 లక్షల కోట్ల ఖర్చు: అఫ్గన్‌లో అమెరికా ఏం సాధించింది?


రెండు దశాబ్దాల పాటు అఫ్గన్‌లో తిష్టవేసిన అమెరికా దళాలు స్వదేశానికి తరలిపోతున్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌పై 2001 సెప్టెంబరు 11న దాడి తర్వాత అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థపై అమెరికా యుద్ధం ప్రకటించింది. బిన్ లాడెన్ సారథ్యంలోని అల్‌ఖైదా, తాలిబన్లను సమూలంగా ఏరివేస్తామని అఫ్గనిస్థాన్‌ గడ్డపై కాలుమోపిన అమెరికా.. ఏం సాధించకుండానే వెనక్కి మళ్లుతోంది. తాలిబన్ల చెర నుంచి అఫ్గన్లకు స్వేచ్ఛను ప్రసాదిస్తామని రొమ్ములు విరుచుకుంటూ వచ్చిన .. వారితోనే రాజీపడి స్వదేశానికి జారుకుంటోంది. అధ్యక్షుడు జో బైడెన్‌ విధించిన సెప్టెంబరు 11 గడువు కంటే ముందే అమెరికా బలగాలు స్వదేశానికి మరలిపోతున్నాయి. తాజాగా, 20 ఏళ్ల పాటు అమెరికా సైన్యం అధీనంలోనే ఉన్న బగ్రాం ఎయిర్‌ఫీల్డ్‌ను ఖాళీ చేసి అఫ్గాన్‌ జాతీయ భద్రత దళాలకు శుక్రవారం అప్పగించింది. ఈ ఎయిర్‌ఫీల్డ్‌ నుంచే అల్‌ఖైదా, తాలిబాన్లపై అమెరికా యుద్ధం చేసింది. యుద్ధం తీవ్రంగా ఉన్న సమయంలో దాదాపు లక్షన్నర మంది సైనికులతో హడావుడిగా ఉన్న ఈ స్థావరంలో ఇప్పుడు 2500-3000కి తగ్గిపోయాయి. వీరికి మద్దతుగా వచ్చిన నాటో దళాలు కూడా వెనక్కి మళ్లాయి. అఫ్గాన్‌లో తమ మిషన్‌లు ముగిశాయని, సైనికులంతా స్వదేశాలకు చేరుకున్నారని జర్మనీ, ఇటలీ ఇటీవలే ప్రకటించాయి. పోలండ్‌ కూడా పూర్తిస్థాయిలో తమ సైనికులను వెనక్కి రప్పించుకుంది. రెండు దశాబ్దాల పాటు అఫ్గన్‌లో చేసిన యుద్ధంలో అమెరికా గెలిచిందా? అంటే సమాధానం వెతుక్కోవాల్సిందే. ఈ పోరాటం కోసం ఈ 20 ఏళ్లలో అమెరికా 148 లక్షల కోట్లు ఖర్చుచేసినట్టు ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. గత 20 ఏళ్లలో అఫ్గాన్‌లో యుద్ధం కోసం అమెరికా 2లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు బ్రౌన్‌ యూనివర్సిటీ అంచనా వేసింది. అంతర్యుద్ధంలో 47,245 మంది అఫ్గాన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 69 వేల మంది వరకూ అఫ్గాన్‌ సైనికులు మరణించి ఉంటారని అంచనా. అమెరికా సైనికులు 2,442 మంది చనిపోగా మరో 20,666 మంది గాయపడ్డారు. అమెరికా కాంట్రాక్టు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది 3,800 మంది మృతి చెందారు. నాటో దేశాలకు చెందిన 1,144 మంది సిబ్బంది కూడా ప్రాణాలు విడిచారు. 2001లో తాలిబన్లు అధికారాన్ని కోల్పోయినా సుదీర్ఘ కాలంగా పోరు కొనసాగించారు. 50శాతం వరకు అఫ్గానిస్థాన్‌ భూభాగం వారి ఆధిపత్యంలోనే ఉందని అంచనా. బిలియన్ డాలర్లు ఖర్చుచేసి అమెరికా ఏం సాధించింది? అఫ్గన్‌లో శాంతి స్థాపన జరిగిందా? తాలిబన్లను తరమేసిందా? అంటే తెల్లమొహం వేయకతప్పదు. గతేడాది నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైన తర్వాత అఫ్గానిస్థాన్‌లో విధ్వంసం తారస్థాయికి చేరింది. అఫ్గాన్ సైన్యం బలహీనతలను ఆసరాగా చేసుకుని గతంలో తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తాలిబన్లు స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నారు. రాజధాని కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరం వరకు వారు వచ్చేశారు. మే 1కి ముందు మొత్తం 387 జిల్లాల్లో 73 జిల్లాలు తాలిబన్ల నియంత్రణలో ఉండేవి. అయితే గత రెండు నెలల కాలంలో 17 ప్రావిన్సుల్లోని 30 జిల్లాలను తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందూజ్‌ ప్రాంతాన్ని సైతం ఆక్రమించారు. తాలిబన్లు శరవేగంగా పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా బలగాలు ముందుగానే అఫ్గాన్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. తమ ప్రధాన శత్రువు లాడెన్‌ను హతమార్చిన తర్వాత అమెరికా పోరాటంలో క్రమంగా వేడి తగ్గింది. 2014 తర్వాత అమెరికా సేనలు దాడులు చేయటం దాదాపు ఆపేశాయి. ఒక్క ఉగ్రవాద వ్యతిరేక దళాలు మాత్రమే చురుగ్గా ఉన్నాయి. ట్రంప్‌ హయాంలోనే అఫ్గానిస్థాన్‌ నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించాలన్న నిర్ణయం తీసుకున్నారు. తర్వాత వచ్చిన జో బైడెన్‌ కూడా దీనిని కొనసాగించారు. తమ దేశంపై దాడులకు అఫ్గానిస్థాన్‌ వేదిక కాకూడదంటూ తాలిబన్లతో ఒప్పందం చేసుకున్నారు.


By July 03, 2021 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/uncertainty-looms-as-u-s-forces-quit-afghanistan-bagram-air-base/articleshow/84085871.cms

No comments