Breaking News

Covid Vaccine సుప్రీం చీవాట్లు పెట్టిన మర్నాడే ఉచిత టీకాలపై మోదీ నిర్ణయం!


దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు, సంధించిన ప్రశ్నలు, వివిధ రాష్ట్రాల నుంచి వినిపిస్తున్న డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం పునరాలోచనలో పడి అందరికీ టీకా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా తామే టీకా వేయిస్తామని సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జూన్ 21 నుంచి దీనిని అమలు చేయనున్నట్లు మోదీ తెలిపారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75 శాతాన్ని తామే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తామని స్పష్టంచేశారు. అయితే, వ్యాక్సినేషన్ విధానాన్ని జూన్ 1నే పునఃపరిశీలించిన .. దీనికి సూత్రపాయంగా ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ రోజు నుంచే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించినట్టు పేర్కొన్నాయి. టీకా విధానంపై ప్రతిపక్షాల విమర్శలు, సర్వోన్నత న్యాయస్థానం గతవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ‘‘వికేంద్రీకృత టీకా విధానం ప్రారంభించి నెల పూర్తయిన తరువాత కేంద్రీకృత ఉచిత టీకాల ప్రణాళికను జూన్ 1 న అధికారులు ప్రధానమంత్రికి సమర్పించారు. ఈ సమావేశంలో ప్రధాని సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.. దాని కోసం క్షేత్రస్థాయిలో చర్యలు జూన్ 1 న ప్రారంభించి.. జూన్ 7న ప్రకటించారు’’ అని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. దేశంలో కరోనా పరిస్థితులపై సుమోటోగా విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. మే 31న కేంద్ర ప్రభుత్వ టీకా విధానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్రం అనుసరిస్తున్న ‘చెల్లింపు టీకాల విధానం’ నిరంకుశం, అహేతుకం అని వ్యాఖ్యానించింది. 45 ఏళ్లు దాటినవారికి ఉచితంగా, 18-44 ఏళ్ల మధ్యవారికి చెల్లింపులతో టీకాలు ఇవ్వడం అసంబద్ధమని, ఆ విధానాన్ని మళ్లీ సమీక్షించాలని ఆదేశించింది. టీకా ధరల్లోనూ వ్యత్యాసంపై కూడా అసహనం వ్యక్తం చేసింది. అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై ముప్పేట దాడి ప్రారంభించడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. రెండో దశ వ్యాప్తి నియంత్రణలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న మోదీ సర్కారు.. వ్యాక్సిన్ విషయంలో విమర్శలు వెల్లువెత్తడంతో వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. జనవరి 16 నుంచి మే 1 వరకు వ్యాక్సినేషన్‌ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగింది. మే 1 నుంచి పూర్తి బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించింది. 18 ఏళ్లు దాటినవారికి అప్పుడే వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాక్సిన్‌పై ప్రధాని ప్రకటనను పలు రాష్ట్రాలు, వివిధ వర్గాలు స్వాగతించాయి. అసమానతలు తొలగిపోయి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశాయి. ఇది సరైన నిర్ణయమని పార్టీలకు అతీతంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వెలిబుచ్చారు. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతోనే కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని కాంగ్రెస్‌ పేర్కొంది.


By June 08, 2021 at 08:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-cleared-covid-vaccination-revamp-in-principle-on-june-1/articleshow/83328398.cms

No comments