కోడల్ని రూ.80వేలకు అమ్మేసిన మామ.. చివరిలో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
కోడలిని మామ అమ్మేసిన అమానుష ఘటన ఉత్తర్ ప్రదేశ్లో గతవారం చోటుచేసుకుంది. ఆమెను రూ.80 వేలకు అమ్మడానికి గుజరాత్కు చెందిన ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాధితురాలిని వారి బారి నుంచి రక్షించి, నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారబంకీ జిల్లా మల్లాపుర్ గ్రామానికి చెందిన వాడీ ప్రిన్స్ వర్మ అనే వ్యక్తి తన భార్యను ఓ ముఠాకు తండ్రి అమ్మేసినట్టు మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తన తండ్రి చంద్రరామ్ వర్మ, తమ గ్రామానికి చెందిన రాము గౌతమ్ అనే మరో వ్యక్తి కలిసి తన భార్యను అమ్మేశారని సమాచారం ఇచ్చాడు. గుజరాత్కు చెందిన షాహిల్ పాంచా అనే వ్యక్తి రూ.80 వేలకు కొనుగోలు చేసి తన భార్యను తీసుకుని వెళ్లిపోతున్నారని, ప్రస్తుతం బారాబంకి రైల్వే స్టేషన్లో ఉన్నారని చెప్పాడు. తక్షణమే స్పందించిన పోలీసులు బారాబంకి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. బాధితురాలి సహా తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి చెర నుంచి బాధితురాలిని విడిపించిన పోలీసులు.. భర్తకు అప్పగించారు. అరెస్టు చేసిన 8 మంది నిందితులలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడు, బాధితురాలి మామ చంద్రరామ్, రాము గౌతమ్లు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. దుకాణంలో సామాన్లు కొన్నట్టు ప్రధాన నిందితుడు చంద్రరామ్ మహిళలతో వ్యాపారం చేస్తాడని స్థానిక ఎసపీ యమున ప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకు 300 మంది మహిళలను కొనుగోలు చేసి వారిని వివిధ ముఠాలకు విక్రయించాడని అన్నారు. ఓ హత్యకేసులో కూడా చంద్రరామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని వివరించారు. ఈ కేసుపై విచారణకు సంయుక్త బృందాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపారు. నిందితులు షాహిల్ పాంచా, పప్పూ భాయ్ శర్మ, అపూర్వ పాంచా, గీతా బెన్, నీతా బెన్, శిల్పా బెన్, రాకేశ్, అజయ్ భాయ్ పాంచాలు గుజరాత్లోని ఉమేదా జిల్లా అదేవ్ అదినాథ్ నగర్కు చెందినవారిగా గుర్తించారు.
By June 08, 2021 at 08:03AM
No comments