Breaking News

‘మా భాషను అవమానించారు.. సారీ చెప్పండి’ ఢిల్లీలో కేరళ నర్సుల ఆందోళన!


నర్సులు తమ మాతృభాషలో మాట్లాడవద్దంటూ ఢిల్లీలో ప్రభుత్వ ఆస్పత్రి ఆదేశాలు జారీచేయడంపై దుమారం రేగుతోంది. ఆస్పత్రి విధుల్లో ఉన్న నర్సులు తమ మాతృభాష మలయాళంలో మాట్లాడొద్దని, హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాట్లాడాలని గోవింద్ బల్లభ్ పంత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) శనివారం వివాదాస్ప ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో ఆ ఆదేశాలను తాజాగా ఉపసంహరించుకుంది. తమ భాషను అవమానించారని, ఇందుకు క్షమాపణలు చెప్పాలని కేరళ నర్సులు డిమాండ్ చేశారు. ఈ వివాదం ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్వయంగా రంగంలోని దిగారు. వివాదాస్పద ఆదేశాలను వెనక్కుతీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు. దీంతో వారు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇందుకు బాధ్యుడైన ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్‌కు కూడా మెమో ఇచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఆ తరువాత ఈ మెమో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వద్దకు వెళుతుంది. ‘విధుల్లో ఉన్న సమయంలో నర్సులు మలయాళంలో మాట్లాడుకుంటున్నారని ఫిర్యాదు అందింది. ఆస్పత్రిలోని అధిక శాతం పేషెంట్లు, సహోద్యోగులకు ఈ భాష తెలియదు.. దీంతో.. వారు ఏం జరుగుతోందో అర్థం కాక తికమక పడుతున్నారు. అందువల్ల నర్సులు అందరూ హిందీ లేదా ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడాలని నిర్దేశించడమైంది. అలా కాని పక్షంలో తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’’ అంటూ ఆస్పత్రి వర్గాలు ఓ సర్క్యులర్ జారీ చేశాయి. ఈ ఉత్తర్వులపై దుమారం రేగడంతో రాజకీయ రంగు పులుముకుంది. కేరళ ఎంపీలుగా ఉన్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిథరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ప్రజాస్వామ్య దేశంలో ఓ ప్రభుత్వాస్పత్రి తమ నర్సులను తమ మాతృభాష అర్థం చేసుగోగలిగిన వారితో ఆ భాషలో సంభాషించవద్దని ఆదేశించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది అవమానకరమే కాకుండా మానవహక్కుల ఉల్లంఘన కూడా. దీనిపై ఈపాటికే తగిన చర్యలు తీసుకుని ఉండాల్సింది’’ అని శశి థరూర్ ట్వీట్ చేశారు. ఈ ఆదేశాలను భాషాపరమైన వివక్షగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. ‘‘దేశంలోని ఇతర భాషలు లాగానే మళయాళం కూడా భారతీయ భాషే. భాషాపరమైన వివక్షను వెంటనే ఆపండి’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘‘ఇది మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. ఇది తమ భాషా స్వేచ్ఛకు ముప్పుగా భావిస్తున్నాం.. మొత్తం రాష్ట్రాన్ని అవమానించినందున సంబంధిత వ్యక్తి మాకు క్షమాపణ చెప్పాలి’’ అని మలయాళ నర్సుల తరఫున ఢిల్లీ యాక్షన్ కమిటీ ప్రతినిధి ఫమీర్ సీకే వ్యాఖ్యానించారు. తమకు తెలియకుండా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు ఆస్పత్రి యాజమాన్యం చెబుతోందని, ఒకవేళ అదే నిజమైతే సర్క్యులర్ ఇచ్చిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు సంబంధిత విభాగం నుంచి క్షమాపణ లేఖ వచ్చే వరకూ నిరసన కొనసాగుతుందని ఫమీర్ స్పష్టం చేశారు.


By June 06, 2021 at 04:22PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nurses-demand-apology-over-dont-speak-in-malayalam-order-by-gb-pant-hospital-in-delhi/articleshow/83280940.cms

No comments