Breaking News

కరోనాతో భారత్ సర్వనాశమయ్యింది.. చైనా పరిహారం చెల్లించాల్సిందే: ట్రంప్ షాకింగ్ కామెంట్స్


పదవి నుంచి దిగిపోయిన తర్వాత తొలిసారిగా భారత్‌లో కరోనా వైరస్ పరిస్థితుల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా భారత్ నాశమయ్యిందని, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి చైనా కారణమని ఆరోపించారు. ఇందుకు అమెరికాకు చైనా 10 ట్రిలియన్ డాలర్లు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవానికి చైనా ప్రపంచం మొత్తానికి పరిహారంగా ఇంత కంటే ఎక్కువ చెల్లించాలి, కానీ వారి సామర్థ్యం ఇదేనని ట్రంప్ అన్నారు. ‘‘చెల్లించాల్సిన దాని కంటే సంఖ్య (పరిహారం) చాలా ఎక్కువ. కానీ అమెరికాకు చెల్లించాల్సింది చాలా ఉంది... ప్రపంచవ్యాప్తంగా చాలా చెల్లించాలి.. వారి నిర్వాకంతో దేశాలు నాశనమయ్యాయి.. ప్రమాదవశాత్తు జరిగిందని నేను ఆశిస్తున్నాను.. ఇది అసమర్థత లేదా ప్రమాదం ద్వారా జరిగిందని భావిన్నాను’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కానీ, ఇలా చూసినప్పుడు అది ప్రమాదవశాత్తు జరిగిందా? ఇంకేమైనా కావచ్చు.. తీవ్రంగా ప్రభావితమైన ఈ దేశాలను చూడండి... వారు ఎప్పటికీ కోలుకోలేరు.. మన దేశం చాలా తీవ్రంగా నష్టపోయింది.. కానీ ఇతర దేశాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి.. భారత్‌నే తీసుకుంటే ఆ దేశంలో ఎన్నడూలేని విధంగా ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడింది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు భారత్‌లో ఏం జరుగుతుందో చూడండి.. మీకు తెలుసా వారు చెప్పేది ఏమిటంటే.. భారతదేశం ఎంతగానో శ్రమిస్తోంది.. ఎందుకంటే వారు ఎప్పుడూ బయటపడటం కోసం చూస్తున్నారు.. భారత్ ఇప్పుడిప్పుడే సర్వనాశనం అయ్యింది.. వాస్తవంగా ప్రతి దేశం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది’’అని ట్రంప్ ఆవేదన చెందారు. ‘‘ఇది ఎక్కడ నుంచి.. ఎలా వచ్చింది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. ఈ విషయం నాకు తెలుసని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం దాని గురించి నాకు ఖచ్చితంగా ఉంది.. అయితే చైనా సహాకరించినప్పుడే వారి ఆర్థిక వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థ వేగంగా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి’’ అని అన్నారు. కరోనా వైరస్ 2019 డిసెంబరులో తొలిసారిగా చైనాలోని వుహాన్ నగరంలోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇది వుహాన్ ల్యాబ్ నుంచే లీకయ్యిందని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు. తాజాగా, మరోసారి తన వాదన వినిపించారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా 38.35 లక్షల మంది బలయ్యారు. 17.75 కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. రెండో దశవ్యాప్తికి చిగురుటాకులా వణికిన భారత్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతున్నాయి.


By June 18, 2021 at 11:24AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/india-has-just-been-devastated-by-covid-19-say-us-former-president-donald-trump/articleshow/83627468.cms

No comments