Breaking News

తెలుగు ప్రజల ఆదరాభిమానాలకు శతకోటి వందనాలు.. జస్టిస్ ఎన్వీ రమణ భావోద్వేగ లేఖ


ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన ఢిల్లీకి తిరుగుపయనమవుతూ భావోద్వేగ లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల్లో తనపట్ల చూపిన ఆదరాభిమానాలు, గౌరవం, ఆతిథ్యానికి చీఫ్ జస్టిస్ సంతోషం వ్యక్తం చేశారు. తన పర్యటనలో భావోద్వేగానికి గురయ్యానని జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ తెలిపారు. ఆదరాభిమానాలు చూపిన ప్రజలకు శతకోటి వందనాలని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు తనను తమ బిడ్డలా ఆదరించి, తల్లిదండ్రులు లేని లోటు తీర్చారని భావోద్వేగానికి గురయ్యారు. వారి దీవెనలతో బాధ్యతలు మరింత సమర్థంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్‌, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, సకల పక్షాల నాయకులు, అధికారులకు, సిబ్బందికి రమణ ధన్యవాదాలు తెలిపారు. సుప్రసిద్ధ హైదరాబాదీ ఆతిథ్యానికి అద్దం పట్టారని ప్రశంసించారు. ‘‘పిల్లలు జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని తల్లిదండ్రులు తపించడం సహజం. తమ విజయాలను చూసి తల్లిదండ్రులు గర్వించాలని,ఆనందించాలని పిల్లలు ఆశించడం కూడా అంతే సహజం.నేనూ అందుకు మినహాయింపు కాదు. నేను భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరుకున్న ఈ సమయంలో నన్ను చూసి గర్వించడానికి, మనస్ఫూర్తిగా అభినందించడానికి నా తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేది. భారత ప్రధాన న్యాయమూర్తిగా నా ఈ వారం రోజుల తొలి పర్యటనలో తెలుగు ప్రజలు ఆ లోటు తీర్చారు. నన్ను కన్న తల్లిదండ్రుల్లా పసిబిడ్డ మాదిరి అక్కునజేర్చుకుని అపార ప్రేమాభిమానాలతో, ఆశీర్వచనాలతో ముంచెత్తిన నిష్కల్మష, ప్రగతిశీల తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు.. నా జీవితంలో భావోద్వేగానికి గురైన సందర్భాలలో ఈ పర్యటన ఒకటి.. కోవిడ్‌కు సైతం వెరవక, వారించినా వినక, వారనక వీరనక అసంఖ్యాకంగా వచ్చి నన్ను తమలో ఒకడిగా, ఆప్తుడిగా భావించి, అభినందించి, వెన్ను తట్టి, ఆశీర్వదించిన పెద్దలు, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముళ్లు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు. న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువత, శ్రామికులు, మహిళలు, రైతులు, సకల జీవన రంగాలకు చెందిన వారు, కులమతాలకతీతంగా, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నన్ను పలకరించి, దీవించారు. స్వంత పనులు ఎవ్వరూ ప్రస్తావించలేదు. వారు కోరిందల్లా న్యాయ వ్యవస్థను పటిష్టపరచమని మాత్రమే. తెలంగాణ సమాజపు నిస్వార్ధ గుణానికి, పరిణతికి ప్రతీకలు వారు. వయోవృద్ధులు, గురుతుల్యులైన విశ్రాంత న్యాయమూర్తులు నన్ను దీవించడానికి ఏడాదిన్నర కోవిడ్ కాలంలో తొలిసారి గడప దాటటం నన్ను కదిలించింది. వారికి నమస్సులు. ముఖ్యమంత్రి మొదలుకుని అతి సాధారణ పౌరుని వరకు ప్రతి ఒక్కరూ ఈ అసాధారణ సమయంలో వ్యయ ప్రయాసలకోర్చి నాకు స్వాగతం పలికి , 'అంతా మనోళ్లే' అన్న తెలంగాణ నైజానికి, సుప్రసిద్ధ హైదరాబాదీ ఆతిధ్యానికి అద్దం పట్టారు. అనూహ్య స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులకు, మంత్రివర్యులు, ప్రజా ప్రతినిధులు, సకల పక్షాల నాయకులు, అధికారులకు ధన్యవాదాలు. దివ్యాతి దివ్యమైన దైవ దర్శనానికి, ఆశీర్వచన ప్రాప్తికి అల్ప వ్యవధిలో అన్ని ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి, యాదాద్రి, శ్రీశైలం దేవస్థానాల పాలక మండళ్లు, ప్రభుత్వ ప్రతినిధులు, స్థానిక అధికారులకు నేనూ, నా సతీమణి శివమాల సదా కృతజ్ఞులం. యాదాద్రిని దేశంలోనే అతి ముఖ్య తీర్థ యాత్రా స్థలాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం. వారం కిందట తెలుగు నేలపై కాలు మోపినప్పటి నుంచి నేడు ఢిల్లీ బయలుదేరే వరకు నన్ను, నా సిబ్బందిని కంటికి రెప్పలా చూసుకున్న తెలంగాణ ప్రభుత్వ అధికారులు, రాజ్ భవన్ సిబ్బంది, హైకోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఎంతగానో సహకరించిన పాత్రికేయులకు కృతజ్ఞతలు. కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని శాస్త్రవేత్తలు, ప్రభుత్వం నిర్ధారించేవరకు దయచేసి తగు జాగ్రత్తలు పాటిస్తూనే ఉండండి. ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. తెలుగు ప్రజల దీవెనల బలంతో నా రాజ్యాంగ బద్ధ విధులను సమర్థంగా నిర్వహించగలనన్న నమ్మకంతో తిరుగు ప్రయణమవుతున్నా’’ అని జస్టిస్ ఎన్వీ రమణ లేఖ రాశారు.


By June 21, 2021 at 07:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-cji-justice-nv-ramana-emotional-letter-to-telugu-people/articleshow/83704447.cms

No comments