Breaking News

బెంగాల్‌లో కలకలం.. బీజేపీ ఆఫీసు వద్ద 50కిపైగా పెట్రోల్ బాంబులు


బెంగాల్‌లో బీజేపీ కార్యాలయానికి సమీపంలో భారీగా బాంబులు బయటపడటం కలకలం రేగుతోంది. కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును తెరవగా.. అందులో 50కిపైగా బాంబులు బయటపడ్డాయి. అయితే, ఈ బాంబులను ఇక్కడకు ఎలా వచ్చాయి.. ఎవరు తెచ్చారనేది తెలియాల్సి ఉంది. నిందితులు బాంబులను పండ్లను పార్సిల్ చేసే సంచుల్లో తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. బీజేపీ కార్యాలయం వద్దే ఎందుకు బాంబులను ఉంచారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ ఆఫీసు సమీపంలో బాంబులున్నట్టు మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి పోలీసులకు సమాచారం అందినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో హాస్టింగ్ పోలీస్ స్టేషన్‌ నుంచి బాంబు స్క్యాడ్, యాంటీ-రౌడీ సెక్షన్ విభాగం అధికారులు అక్కడకు చేరుకుని బాంబులను నిర్వీర్యం చేశారు. ఈ బాంబులు పేలుంటే భారీ నష్టం జరిగేదని ఓ సీనియర్ అధికారి అన్నారు. బాంబులు ఇక్కడకు ఎలా వచ్చాయనే విషయమై దర్యాప్తు జరుగుతోందని, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత నెల బెంగాల్‌లోని బిర్భమ్ జిల్లాల్లో పెట్రోల్ బాంబు పేలిన ఘటనలో ఓ 11 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఖాతిపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బాంబు ఉంచిన బాక్సును పట్టుకోవడంతో అది పేలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెంగాల్‌లో హింస చెలరేగి దాదాపు 40 మంది చనిపోయారు. వీరిలో 37 మంది బీజేపీ కార్యకర్తలున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. దాడులకు పాల్పడింది టీఎంసీ కార్యకర్తలేనని బీజేపీ ఆరోపించగా.. వీటిని సీఎం తోసిపుచ్చారు.


By June 06, 2021 at 10:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/over-50-crude-bombs-recovered-near-bjp-office-in-west-bengals-kolkata/articleshow/83277185.cms

No comments