Breaking News

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కుటుంబసభ్యులకు కరోనా సోకితే 15 రోజుల ప్రత్యేక లీవులు!


ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంలో తల్లిదండ్రులు లేదా వారిపై ఆధారపడిన మరెవరైనా కొవిడ్‌ బారిన పడితే 15 ప్రత్యేక సాధారణ సెలవులను వాడుకునే వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రిలో చేరి పదిహేను రోజులు దాటినా నయం కాకుంటే వారు డిశ్చార్జి అయ్యేదాకా ఇతర సెలవులను కూడా వాడుకోవచ్చంటూ స్పష్టం చేసింది. కొవిడ్‌ కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ అవకాశం కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగికి కొవిడ్‌ పాజిటివ్‌‌గా నిర్దారణ అయి.. హోం ఐసోలేషన్‌లో ఉంటే 20 రోజుల కమ్యూటెడ్‌ లీవ్స్‌ మంజూరు చేస్తారు. పాజిటివ్‌ వచ్చిన ప్రభుత్వోద్యోగి ఐసోలేషన్ ఉండటంతోపాటు ఆసుపత్రిలో చేరాల్సి వస్తే ప్రయాణ సెలవులు/ ప్రత్యేక క్యాజువల్‌ లీవ్స్/ ఎర్నడ్‌ లీవ్స్ 20 రోజుల వరకు వాడుకోవచ్చు. సంబంధిత పత్రాల ఆధారంగా ఈ సెలవులను వాడుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీచేసింది. కుటుంబసభ్యులు కొవిడ్‌ బారినపడి ప్రభుత్వ ఉద్యోగి హోం క్వారంటైన్‌లో ఉంటే ఏడు రోజులపాటు ఆన్‌డ్యూటీ లేదా వర్క్‌ ఫ్రం హోం కింద పరిగణిస్తారు. సదరు ఉద్యోగి నివాసం ఉండే ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోనుగా పరిగణించినంతకాలం ఇది కొనసాగుతుంది. కరోనా మొదటి దశకు కూడా వర్తించేలా ఈ ఉత్తర్వులు గతేడాది మార్చి 25 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఇవి కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ చికిత్స, హాస్పటలైజేషన్, క్వారంటైన్ ప్రోటోకాల్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇందులో తెలిపింది. సాధారణ సెలవులకు సంబంధించి ఉద్యోగులు ఇటీవల పలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది.


By June 10, 2021 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/central-govt-employees-to-get-15-days-casual-leave-if-dependents-test-covid-19-positive/articleshow/83389748.cms

No comments