Breaking News

చైనా: గ్యాస్ పైప్‌లైన్ పేలి 12 మంది మృతి.. 37 మందికి తీవ్రగాయాలు


చైనాలో ఆదివారం పెను ప్రమాదం చోటుచేసుకుంది. మధ్య చైనాలోని హుబే ప్రావిన్సుల్లో గ్యాస్‌ పైపులైన్‌ పేలి 12 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఝంగ్వాన్ జిల్లా షియాన్ నగరంలో ఒక్కసారిగా గ్యాస్ పైపులైన్ పేలింది. షియాన్‌లోని యన్‌హు మార్కెట్ వద్ద పేలుడు సంభవించినట్టు హాంకాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది. ప్రమాద సమయంలో చాలా మంది మార్కెట్‌లో కూరగాయలు లేదా బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటారని పేర్కొంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, చాలా మంది చిక్కుకున్నారని షియాన్ మున్సిపల్ ఆఫీసు వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలిసిరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, 2013లోనూ ఈశాన్య చైనాలోని క్వింగ్డోలో ఇటువంటి ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న పైపులైన్ పేలి 55 మంది ప్రాణాలు కోల్పోయారు. షియాన్ పైప్‌లైన్ పేలుడుకు ముందు రోజే గుయాంగ్ నగరంలోని విషవాయువు లీకయి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. రసాయనాలు తరలించే ఓ వాహనం నుంచి ఈ వాయువు లీకయ్యింది. చైనాలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిర్వహణలోపం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాధ్యులపై కఠినమైన శిక్షలు విధించినా అదుపులోకి రావడం లేదు. చైనాలో 2015లో టియాంజిన్‌ నగరంలోని రసాయన గిడ్డంగి వద్ద 2015లో జరిగిన భారీ పేలుడులో 173 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది అగ్నిమాపక సిబ్బంది.. పోలీసు అధికారులు ఉన్నారు. అక్రమ నిర్మాణం, పేలుడు పదార్థాల నిల్వలో భద్రతను పాటించపోవడంతో ప్రమాదం జరిగింది.


By June 13, 2021 at 03:06PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/two-killed-and-37-injured-in-gas-explosion-hubei-province-city-of-shiyan-in-china/articleshow/83480713.cms

No comments