Breaking News

కరోనాకు ‘ఐవర్‌మెక్టిన్’ వినియోగానికి గోవా అనుమతి.. WHO తీవ్ర హెచ్చరికలు


పలు రకాల ఇన్‌ఫెక్షన్లకు చికిత్సలో వినియోగించే ‘ఐవెర్‌మెక్టిన్‌’ ఔషధాన్ని కరోనా బాధితులకు వాడటాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వ్యతిరేకించింది. నోటి ద్వారా తీసుకునే ఈ ఔషధాన్ని కరోనా బాధితులకు చికిత్సలో ఉపయోగించవద్దని చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మంగళవారం స్పష్టం చేశారు. ‘‘కొత్త సూచన కోసం ఏదైనా ఔషధాన్ని ఉపయోగిస్తున్నప్పుడు భద్రత, సమర్థత ముఖ్యమైనవి.. క్లినికల్ ట్రయల్స్‌లో తప్ప చికిత్సకు '' వాడకానికి డబ్ల్యూహెచ్ఓ వ్యతిరేకం’’ అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జర్మనీకి చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ సంస్థ మెర్క్ కూడా ఇటువంటి హెచ్చరికలే చేసింది. ఈ సంస్థ ప్రకటనను కూడా డాక్టర్ స్వామినాథన్ తన ట్వీట్‌కు జతచేశారు. కరోనాకు చికిత్సలో ఐవర్‌మెక్టిన్ వినియోగంపై అందుబాటులో ఉన్న అధ్యయనాలు, పరిశోధనలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారని మెర్క్ పేర్కొంది. ‘రెగ్యులేటరీ ఏజెన్సీలు ఆమోదం తెలిపిన సమాచారంలో సూచించిన మోతాదుకు మించి 'ఐవర్‌మెక్టిన్' భద్రత, సమర్థత గురించి అందుబాటులో ఉన్న డేటాను పరిగణనలోకి తీసుకోలేం’అని స్పష్టం చేసింది. ఐవర్‌మెక్టిన్ గురించి గత రెండు నెలల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన రెండో హెచ్చరిక ఇది. ఈ ఔషధం వినియోగించడం వల్ల కోవిడ్ మరణాలు, బాధితులు ఆస్పత్రుల్లో చేరడం తగ్గిస్తుందనడానికి సరైన ఆధారాలు లేవని మార్చిలో డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. కోవిడ్-19కు 'ఐవర్‌మెక్టిన్' వినియోగానికి ఆధారాలు ప్రస్తుతం మావద్ద లేవని, ఎటువంటి క్లినికల్ ట్రయల్స్ ప్రయోజనం వివరించలేదని తెలిపింది. కాగా, కోవిడ్ బారినపడ్డ యువత చికిత్స కోసం ఐవర్‌మెక్టిన్ ఔషధం వినియోగానికి గోవా ఆమోదం తెలిపిన రెండు రోజుల తర్వాత డబ్ల్యూహెచ్ఓ ప్రకటన రావడం గమనార్హం. గోవా ఆరోగ్య మంత్రి విశ్వజీత్ పీ రానే మాట్లాడుతూ.. యూకే, ఇటలీ, స్పెయిన్, జపాన్ నిపుణుల బృందం నివేదిక ఆధారంగా ఐవర్‌మెక్టిన్‌కు ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. ఈ ఔషధం ఇచ్చిన కోవిడ్ రోగుల్లో మరణాలు ముప్పు తగ్గడం, త్వరగా కోలుకోవడం జరిగినట్టు ఈ నివేదికలు తెలిపాయన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. ఐదు రోజులకు 12 ఎంజీ వేసుకోవాలని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీకి చెందిన కైలీ వాగ్‌స్టాఫ్‌ నేతృత్వంలోని బృందం ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని కరోనా వైరస్‌పై ప్రయోగించింది. ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన వైరస్‌ను ఇది రెండు రోజుల్లోనే నిర్వీర్యం చేసినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘ఒక డోస్‌తో వైరస్‌కు సంబంధించిన ఆర్‌ఎన్‌ఏను 48 గంటల్లో పూర్తిగా నిర్మూలించొచ్చని గుర్తించాం. 24 గంటల్లోనే గణనీయ స్థాయిలో వైరస్‌ తగ్గిపోయింది’ అని కైలీ వెల్లడించారు. ఈ ప్రయోగాలను ల్యాబ్‌లోనే చేశామని, మానవులపై ఇంకా పరీక్షించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.


By May 11, 2021 at 12:15PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/who-warns-against-use-of-ivermectin-drug-for-coronavirus-treatment/articleshow/82543413.cms

No comments