Breaking News

US Vaccine విదేశాలకు 80 మిలియన్ టీకా డోస్‌లు.. కీలక ప్రకటన చేసిన బైడెన్


అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సత్ఫలితాలను ఇస్తోంది. క్రమంగా అక్కడ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కరోనా వైరస్ మొదలైన తర్వాత తొలిసారిగా 50 రాష్ట్రాల్లో కేసులు తగ్గాయని అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. కోవిడ్ పరిస్థితులపై సోమవారం ఆయన మాట్లాడుతూ.. రోజు రోజుకూ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అన్నారు. చీకటిగా ఉన్న సొరంగం చివరన కాంతి ప్రతిరోజూ ప్రకాశవంతంగా పెరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అమెరికా ప్రపంచంలోని వ్యాక్సిన్ల ఆయుధశాలగా అవతరిస్తుందని అన్నారు. వచ్చే ఆరు వారాల్లో విదేశాలకు 80 మిలియన్ డోస్‌లను అందజేయనున్నామని బైడెన్ తెలిపారు. ఇది అమెరికాలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 13 శాతమని పేర్కొన్నారు. వీటిని జూన్ చివరి నాటికి పంపిణీ చేస్తామని వివరించారు. ప్రపంచంలో మరే దేశమూ ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లను అందజేయలేదని బైడెన్ అన్నారు. అమెరికా వద్ద 30 మిలియన్ల వరకు ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ టీకాలు అదనంగా ఉన్నాయి. ఈ కొవిడ్‌-19 టీకాలను భారత్‌కు పంపకపోవడం పట్ల బైడెన్‌ యంత్రాంగం ఇప్పటికే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో విదేశాలకు వ్యాక్సిన్ల పంపిణీపై బైడెన్ ప్రకటన చేయడం కాస్త ఊరట కలిగించింది. కాగా, వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిపదార్థాల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని అమెరికా సడలించింది. భారత్‌లో పరిస్థితులు చూసి మెత్తబడ్డ అగ్రరాజ్యం.. అత్యవసర సాయం అందజేస్తోంది. మెడికల్‌ ఆక్సిజన్‌, కరోనా టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు, కొవిడ్‌ రోగుల చికిత్సలో ఉపయోగపడే ఇతర ఔషధాలను భారత్‌కు పంపుతోంది.


By May 18, 2021 at 09:03AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-will-send-80-million-doses-to-overseas-says-joe-biden/articleshow/82728732.cms

No comments