Breaking News

PNB Scam క్యూబాకు పారిపోతూ డొమినికాలో పట్టుబడ్డ మెహుల్ చోక్సీ!


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి అదృశ్యమైన విషయం తెలిసిందే. అంటిగ్వాలో ఆదృశ్యమైన చోక్సీ నాటకీయ పరిణామాల మధ్య డొమినికాలో పట్టుబడ్డారు. ఆయన క్యూబాకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంటిగ్వాలో మిస్సయిన చోక్సీ బోటులో డొమినికాకు చేరినట్టు పేర్కొన్నాయి. ఆయనపై లుకౌట్ నోటీస్ జారీచేయడంతో డొమినికా పోలీసులు పట్టుకుని తమ కస్టడీలోకి తీసుకున్నట్టు వివరించాయి. ఆయనను అంటిగ్వా అధికారులకు అప్పగించే కార్యాచరణ కొనసాగుతోందని, చోక్సీ ఆచూకీ లభించిన సమాచారం సీబీఐ, ఈడీలకు చేరవేశారని అన్నాయి. అంటిగ్వా కోర్టుల్లో తమ కేసు బలంగా ఉండటంతోనే చోక్సీ పారిపోయే ప్రయత్నం చేశారని, నిందితుడిని తర్వలోనే భారత్‌కు తీసుకొస్తామనే నమ్మకం ఉందని సీబీఐ వర్గాలు వ్యాఖ్యానించాయి. ప్రముఖ రెస్టారెంట్‌లో విందు కోసం చోక్సీ సోమవారం సాయంత్రం వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ఆయన మిస్సింగ్‌పై అంటిగ్వా అధికారికంగా ధ్రువీకరించలేదు. మెహుల్ చోక్సీ అదృశ్యమైనట్టు ఇప్పటి వరకూ ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లేదని అంటిగ్వా ప్రధాని గ్యాస్టన్ బ్రౌనే ప్రకటించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతోనే గాలింపు చేపట్టామని తెలిపారు. అంటిగ్వా కోర్టుల్లో చోక్సీ పౌరసత్వం స్వీకరణ, రద్దు కేసులను ఎదుర్కొంటున్నారని ప్రధాని తెలిపారు. యూకేకు చెందిన ప్రముఖ న్యాయవాది ఈ కేసుల్లో వాదనలు వినిపిస్తున్నారు. అయితే, మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని ఆయన తరఫున లాయర్ విజయ్ అగర్వాల్ తోసిపుచ్చారు. సోమవారం రాత్రి డిన్నర్‌కు వెళ్లిన చోక్సీ.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అంటిగ్వా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయన వాహనాన్ని రెస్టారెంట్‌ సమీపంలోని జాలీ హార్బర్‌లో గుర్తించారు. కేసులో నిందితుడైన మెహుల్ చోక్సీ 2017లో అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. అయితే, 2018లో పీఎన్‌బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్‌మోదీ, మెహుల్‌ చోక్సీ దేశం విడిచి పరారయ్యాడు. నీరవ్‌ మోదీకి మెహుల్‌ చోక్సీ మేనమామ అవుతారు. నీరవ్ ప్రస్తుతం బ్రిటన్‌ జైల్లో ఉన్న విషయం విదితమే. గీతాంజలి జ్యువెలర్ గ్రూప్ అధినేత అయిన మెహుల్ చోక్సీ కోసం సీబీఐ, ఈడీలు గాలిస్తున్నాయి. మొత్తం రూ.13,578 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం కేసులో చోక్సీ రూ.7,080 కోట్లు మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణం బయటపడటానికి నెల రోజుల ముందే 2018 జనవరి 4 అంటిగ్వాకు చెక్కేశారు. అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ కాగా.. 2013లో స్టాక్ మార్కెట్ మోసం కేసులోనూ ఆరోపణలు ఉన్నాయి. చోక్సీ కేవలం భారతీయ బ్యాంకులనే కాదు, దుబాయ్, అమెరికాలకు చెందిన వ్యాపారులు, కస్టమర్లను మోసం చేసినట్టు ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. అతడికి చెందిన రూ.2,500 కోట్ల ఆస్తులను ఇప్పటికే జప్తు చేశారు. అయితే, అంటిగ్వా-బార్బుడా ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో మెహుల్ చోక్సీ పౌరసత్వాన్ని రద్దుచేసింది. దీనిని ఆయన కోర్టులో సవాల్ చేశారు.


By May 27, 2021 at 06:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/diamond-merchant-mehul-choksi-dramatic-capture-after-escape-by-boat/articleshow/82992904.cms

No comments