Covid దేశంలో 3 లక్షల దాటిన మృతులు.. గత 12 రోజుల్లో 50 వేల మంది బలి
దేశంలో కరోనా మరణాల సంఖ్య మూడు లక్షలు దాటింది. కేవలం 26 రోజుల్లోనే లక్ష మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంత తక్కువ వ్యవధిలో లక్ష మరణాలు నమోదుకాలేదు. అమెరికాలో కోవిడ్ మరణాలు 3.5 లక్షల నుంచి 4.5 లక్షలకు చేరడానికి 31 రోజులు పట్టింది. ఇక, 12 రోజుల కిందట రెండున్నర లక్షలున్న కోవిడ్ మరణాలు.. శనివారం నాటికి మూడు లక్షలు దాటేయడం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచంలో అత్యధిక కోవిడ్ మరణాలు చోటుచేసుకున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా (6.5 లక్షలు), బ్రెజిల్ (4.5 లక్షలు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే, రెండో దశ వ్యాప్తిలోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయి. మూడు లక్షల మరణాల్లో 1.48 లక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చోటుచేసుకున్నవే. మే నెలలో 23 రోజుల్లోనే 92,000 మంది మహమ్మారికి బలయ్యారు. ఏప్రిల్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. ఏప్రిల్లో 48,768 మంది చనిపోయారు. అయితే, అధికారుల లెక్కల్లోకి రాని మరణాలు వీటికి రెట్టింపు ఉంటాయని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత రెండు నెలలుగా శ్మశానవాటికల్లో జరుగుతున్న అంత్యక్రియలకు, అధికారుల లెక్కలకు పొంతనలేదని అంటున్నారు. ఇక, రోజువారీ కేసులు తగ్గుతున్నా.. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. మే 8తో పోల్చితే ప్రస్తుతం రోజువారీ కేసుల్లో సగటు తగ్గుదల 32 శాతంగా ఉంది. మే 8న 3.9 లక్షల కేసులు నమోదుకాగా.. మే 22న 2.64 లక్షలకు చేరాయి. దీనికి విరుద్ధంగా మే 16 న 4,040 గరిష్టాన్ని తాకినప్పటి నుంచి ఏడు రోజుల సగటు మరణాలు కేవలం 5 శాతానికి తగ్గాయి. ఇది మే 22 న 3,838గా ఉంది. దేశంలోని అత్యధిక కోవిడ్ మరణాలు మహారాష్ట్రలో చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకూ అక్కడ 88,620 మంది ప్రాణాలు కోల్పోగా.. రెండో దశలోనే ఫిబ్రవరి 15 తర్వాత 37,068 నమోదయ్యాయి. తర్వాత అత్యధికంగా కర్ణాటక 25,284, ఢిల్లీ 23,202 మరణాలు, తమిళనాడు 20,468 మరణాలు నమోదయ్యాయి. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మాత్రం 19,224 మందిని మహమ్మారి బలితీసుకుంది.
By May 24, 2021 at 07:23AM
No comments