Breaking News

Bombay High Court ఏకధాటిగా 12 గంటలు.. 80 కేసులు విచారణ.. కనీసం లంచ్ బ్రేక్ లేకుండా!


ప్రత్యేక ధర్మాసనం రికార్డుస్థాయిలో 12 గంటలపాటు ఏకధాటిగా పనిచేసి, 80 కేసులను విచారించింది. కనీసం భోజన విరామం కూడా తీసుకోకుండా న్యాయమూర్తు వర్చువల్ విధానంలో 80 కేసులకు సంబంధించి వాదనలు విన్నారు. బుధవారం ఉదయం 10.45 గంటలకు విచారణను ప్రారంభించిన జస్టిస్ ఏజే కథావాలా, జస్టిస్ ఎస్‌పీ తావ్డేలతో కూడిన ధర్మాసనం రాత్రి 11.15 గంటల వరకు విచారణలు కొనసాగించింది. భోజన విరామం కూడా తీసుకోని న్యాయమూర్తులు మధ్యలో మాత్రం టీ బ్రేక్ మాత్రం తీసుకున్నారు. జస్టిస్ కథావాలా గతంలోనూ ఈ విధంగా సుదీర్ఘంగా విచారణలు కొనసాగించారు. మూడేళ్ల కిందట 2018 మేలో వేసవి సెలవులకు ముందురోజు తెల్లవారుజామున 3.30 గంటల వరకు 120 కేసుల్లో వాదనలు విన్నారు. అప్పట్లో ఆయన 16 గంటల సుదీర్ఘంగా సీటులో కూర్చోవడం విశేషం. ఇక, బుధవారం విచారించిన కేసుల్లో ఎల్గార్ పరిషత్ నిందితుల బెయిల్, చికిత్స, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల వంటి పలు ముఖ్యమైన కేసులు ఉన్నాయి. భీమా కోరేగావ్ కేసులో నిందితుడు స్టాన్ స్వామి, హానీ బాబు తండ్రి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విచారించి ఉత్తర్వులు జారీచేశారు. చివరిగా అనిల్ దేశ్‌ముఖ్ వ్యవహారంపై విచారణ జరిగింది. మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చడానికే ఉద్దేశపూర్వకంగా అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేశారని దాఖలైన్ పిటిషన్‌పై వాదనలు విన్నారు. చివరి కేసు వాదనలు విన్నప్పుడు.. ధర్మాసనం గురువారం కూడా బోర్డును ఖరారు చేయడం విశేషం.


By May 21, 2021 at 02:00PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bombay-high-court-bench-sits-for-over-12-hours-to-conduct-marathon-hearing-in-80-cases/articleshow/82825771.cms

No comments